breaking news
biopesticides
-
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
కోడుమూరులో పట్టుబడిన బయో మందులు
కోడుమూరు రూరల్ : కోడుమూరులో అనుమతి లేని నకిలీ బయో మందులను భారీగా పట్టుకున్నారు. మండల వ్యవసాయాధికారి అక్బర్బాషా సోమవారం తనిఖీల చేపట్టాడు. అందులో క్రాంతి ట్రాన్స్పోర్టులో రవాణాకు సిద్ధంగా ఉన్న రూ.4,81,000లు విలువ చేసే అనుమతి లేని బయో మందులు, వెల్దుర్తి రోడ్డులోని ఒక దుకాణానికి సంబంధించి అనుమతి లేని గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.5లక్షలు పైగా విలువ చేసే మందులు పట్టుబడ్డాయి. గత వారం రోజుల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు బయోలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టుబడ్డ మందులను సీజ్ చేశా: అక్బర్బాషా, మండల వ్యవసాయాధికారి, కోడుమూరు క్రాంతి ట్రాన్స్పోర్టులో రూ.4,81,000 విలువ చేసే అనుమతి లేని 23రకాలను బయో మందులు సీజ్ చేశా. ఇందులో 10మందుల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతున్నా. అలాగే అనుమతి లేని గోడౌన్లో పట్టుబడ్డ బయో మందుల అమ్మకాలను కూడా నిలిపేసి వాటి విలువను అంచనా వేస్తున్నా. -
‘బయో’ మోసం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్లైన్: వాతావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో బయో ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఇదే అదనుగా మర్కెట్ను నకిలీ ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. డీలర్లు, దళారులు రైతులు మభ్యపెడుతున్నారు. కొందరు వ్యవసాయాధికారులు ఇందుకు వంత పాడుతున్నారు. జిల్లాలో అనుమతి పొందిన కంపెనీలు రెండు మూడే కాగా.. 160 పైగా అడ్రస్ లేని కంపెనీలు ఎడాపెడా బయోపెస్టిసైడ్స్ను ఉత్పత్తి చేసేస్తున్నాయి. డబ్బాలపై ముద్రిస్తున్న చిరునామా ఆనవాలు కూడా ఆయా ప్రాంతాల్లో లభించకపోవడం గమనార్హం. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, తదితర ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. రూ.40 పెట్టుబడితో రూ.1000లకు పైగా ఆర్జించే అవకాశం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ వ్యాపారంపైనే. అయితే వీటిపై నియంత్రణ అధికారం వాణిజ్య, ఆదాయ పన్ను శాఖలకు మాత్రమే ఉండటంతో వ్యవసాయ శాఖ చేతులెత్తేస్తోంది. బయో పెస్టిసైడ్స్ ఉత్పత్తిదారులు వాణిజ్య పన్నుల శాఖ అనుమతి పొంది వ్యాట్ చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 33 శాతం ఆదాయ పన్ను కట్టాలనే నిబంధన విధించారు. ఈ శాఖలు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రధానంగా ఈ వ్యాపారం కొందరు పెస్టిసైడ్స్ డీలర్లు, వ్యవసాయాధికారులే సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే దాదాపు రూ.5 వేల కోట్ల బయో మందుల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఈసారి పత్తి సాగు పెరగడం.. చీడపీడల బెడద ఎక్కువగానే ఉండటంతో వ్యాపారం జోరందుకుంది. అయితే సంబంధిత శాఖలేవీ పట్టించుకోకపోవడం నకిలీ ఉత్పత్తులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. డీలర్లు దుకాణాల్లో పైన కొన్ని కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ లోలోపల నకిలీలు విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు. బయో కంపెనీ ఏర్పాటుకు అనుమతితో పాటు మైక్రో బయాలజీ ల్యాబ్ తప్పనిసరి. అయితే ఇలాంటివేవీ లేకుండానే కొత్త కంపెనీలు ఏర్పాటవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అదేవిధంగా రైతులు మోసపోయామని తెలుసుకునే వీలు కూడా లేకపోవడం.. అవగాహన రాహిత్యం కారణంగా నకిలీ బయో ఉత్పత్తుల వ్యాపారం జిల్లాలో మూడు పూవ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అంతా గ్రాఫిక్సే: బయో వ్యాపారం గ్రాఫిక్స్ చాటున నడుస్తోంది. చాలా కంపెనీలు 15 నుంచి 20 రకాల చిరునామాలతో లేబుళ్లు తయారు చేయించి డబ్బాలపై అతికించి మార్కెట్లోకి నకిలీ బయో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. లీటరు మందు, డబ్బా, లేబుల్కు రూ.40 ఖర్చు అవుతుండగా.. మార్కెట్లో ఈ ఉత్పత్తులను రూ.1000లకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. పెస్టిసైడ్ డీలర్లు వ్యవసాయాధికారుల నియంత్రణలో ఉండటంతో.. వారిపై ఒత్తిడి పెంచి ఆకర్షణీయమైన కమీషన్లను ఆశచూపి గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఏడాది వ్యవసాయ శాఖ కమిషనర్ కొన్ని బయో కంపెనీల పేర్లు, చిరునామాలు ఇచ్చి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన కంపెనీల జాడ కూడా లభించకపోవడం గమనార్హం. డీలర్లు, అధికారులే సూత్రధారులు బయో ఉత్పత్తులను విక్రయిస్తున్నారంటే సంబంధిత కంపెనీల చిరునామాలు డీలర్లకు తప్పనిసరిగా తెలుసుండాలి. అయితే వీరే సృష్టికర్తలు కావడంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. కొందరు వ్యవసాయాధికారులు కొన్ని కంపెనీల బయో ఉత్పత్తులను భారీగా విక్రయించిన డీలర్లను విదేశీ టూర్లకు పంపుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో పత్తి, మొక్కజొన్న, ఉల్లి, మిరప, కంది సాగు అధికమైంది. దీంతో బయో ఉత్పత్తుల వ్యాపారం రూ.8 వేల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా. వ్యవసాయా శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన ఓ ఏడీఏ నకిలీ చిరునామాలతో ఆరేడు కంపెనీల బయో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో విజిలెన్స్ అధికారులు రెండు విడతల దాడులతో సరిపెట్టుకున్నారు. కర్నూలు నగర సమీపంలోని దిన్నెదేవరపాడులో ఉన్న కర్షక్ ఆగ్రో కెమికల్స్పైనా, కొత్త బస్టాండ్ వద్దనున్న పెస్టిసైడ్స్ దుకాణంలో దాడులు నిర్వహించగా కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ బయో ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు.