breaking news
Biography Film
-
Kodi Rammurthy Naidu: తెరపైకి కలియుగ భీముడు
వీరఘట్టం: మల్ల మార్తాండ, కళియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్గా ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటి చెప్పిన సిక్కోలు ముద్దు బిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర వెండితెరపై రావడానికి సిద్ధమవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, హీరోలు, రచయితలు కోడి రామ్మూర్తినాయుడు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన స్వగ్రామం వీరఘట్టంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. వీరఘట్టంకు చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తినాయుడు జన్మించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన రామ్మూర్తిని తండ్రి ఎంతో గారాబంగా చూసేవారు. రామ్మూర్తినాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో బాల్యంలోనే కొడుకుని చదువు కోసం తండ్రి వెంకన్న వీరఘట్టం నుంచి విజయనగరంలోని పినతండ్రి నారాయణస్వామి ఇంటికి పంపించేశారు. విజయనగరంలో కూడా చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొనేవారు. ఇక రామ్మూర్తికి చదువు అబ్బదని గ్రహించిన పిన తండ్రి రామ్మూర్తిని మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలలో చేర్పించారు. తర్వాత వ్యాయామ ఉపాధ్యాయునిగా నాయుడు విజయనగరంలో తాను చదివిన కళాశాల్లోనే పీడీగా చేరారు. కోడి రామ్మూర్తి విగ్రహం వద్ద ఆయన వారసులు బహుముఖ ప్రజ్ఞాశాలి.. రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యలను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహదారుఢ్యం, యోగా విద్యలను అలవోకగా చేసేవారు. తర్వాతి కాలంలో ఆయన విజయనగరంలో ఓ సర్కస్ కంపెనీ మొదలుపెట్టారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. వీరఘట్టంలో రామ్మూర్తినాయుడు జన్మించిన గృహం ఇదే రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. బ్రహ్మచారి.. కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు బ్రహ్మచారి. శాకాహారి అయిన ఆయన ఆంజనేయ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజ చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి పిలిచి మంత్రోపదేశం చేశారట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని స్థానికులు చెబుతారు. కుదిరిన అగ్రిమెంట్.. ఇలాంటి మహాబలుని జీవిత గాథ తెరపై ఎక్కించేందుకు ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వీరఘట్టం వచ్చి ఇక్కడ రామ్మూర్తినాయుడు సంచరించిన ప్రదేశాలను, నివాస గృహాన్ని పరిశీలించా రు. అలాగే విజయనగరంలో రామ్మూర్తినాయుడు చదువుకున్న కళాశాలను, పనిచేసి నివాసం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. మా చిన్న తాత.. కోడి రామ్మూర్తి నాయుడు మా చిన్నతాతయ్య. నేను 1947లో పుట్టాను. అప్పటికే ఆయన చనిపో యారు. అప్పటిలో ఆయన గొప్పతనం మాకు తెలియలేదు. నేను పెద్దయ్యా క ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. టీచర్గా రిటైరై ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డాను. ఇటీవల సినిమా వాళ్లు సంప్రదింపులు చేశారు. మా తాతయ్య జీవిత చరిత్ర సినిమా గా తీస్తామంటే పూర్తిగా ఆయన చరిత్ర వివరించాం. – కోడి కైలాసరావు, రామ్మూర్తినాయుడి మనవడు, రిటైర్డ్ టీచర్, హైదరాబాద్ అమెరికాలోనూ.. కోడి రామ్మూర్తి నాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రవాసాంధ్రులందరికీ ఆయన గురించి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరపై చూపించేందుకు సినీ ప్రముఖులు మా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. మరి కొద్ది రోజుల్లో ఆయన జీవిత చరిత్ర సినిమా ద్వారా ప్రపంచ నలుమూలలా తెలియనుండడం ఎంతో ఆనందంగా ఉంది. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి ముని మనవడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమెరికా సాహసాలు విన్నాం.. రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. మా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నాం. నేను ఆయనను చూడలేదు. మా నాన్న చెప్పేవారు. ఇటీవల ఓ సినీ సంస్థ వారు వచ్చారు. జీవిత చరిత్ర తీస్తామంటే మా కుటుంబం అంతా అంగీకరించాం. ఎప్పుడు సినిమా మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. – కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తినాయుడి మనవడు, వీరఘట్టం -
సానియా బయోపిక్
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా జీవిత చరిత్ర సినిమాగా రానుంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా దీనిని రూపొందిస్తారు. ‘కొంత కాలంగా బయోపిక్పై చర్చలు నడుస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ముందుకెళ్లడంపై దృష్టిపెట్టాం. ఇందుకు నేనిచ్చే ఇన్పుట్సే కీలకం. దర్శకుడు, నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి’ అని సానియా పేర్కొంది. అథ్లెట్ మిల్కా సింగ్, బాక్సర్ మేరీకోమ్, క్రికెటర్ ధోనిల బయోపిక్ల సరసన సానియా బయోపిక్ నిలవనుంది. -
ఇది నకిలీ.. అసలు త్వరలో !
హీరోగా సంజయ్దత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని మరింత పాపులర్ అండ్ ఇంట్రస్టింగ్గా చేశాయి. అందుకే ఆయన బయోగ్రఫీ ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆల్రెడీ రణ్బీర్ సింగ్ హీరోగా రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది విడుదల కానుంది. కానీ ఇంతలోనే సంజయ్దత్ బయోగ్రఫీ అంటూ ‘‘ది క్రేజీ అటోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్దత్’’ అనే టైటిల్తో ఓ బుక్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బుక్ గురించి సంజయ్దత్ స్పందించారు. ‘‘మార్కెట్లో ఉన్న నా బయోగ్రఫీ బుక్కి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బుక్ని ప్రచురించినవాళ్లు నా అనుమతి తీసుకోలేదు. మా లాయర్స్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రాయబడిందని సంబంధిత పుస్తక ప్రచురణ సంస్థ పేర్కొంది. కానీ వాటిలో ఉన్న విషయాలు నా పాత ఇంటర్వ్యూస్లోనివని తెలిసింది. అందులో అన్నీ నిజాలు లేవు. కొన్ని గాసిప్స్, చెప్పుడు మాటలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. ఆయన ఇంకా చెబుతూ– ‘‘ఇక ఏ ఇతర రచయితలు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరని భావిస్తున్నాను. నా అఫీషియల్ బయోగ్రఫీని త్వరలోనే విడుదల చేస్తాం. అందులో ఉన్న సంగతులే వాస్తవమైనవి’’ అన్నారు. -
షకీలా ఆత్మకథతో సినిమా!
ఒకప్పుడు షకీలా చిత్రాలంటే ‘హాట్’ కేకులే. వాటి దెబ్బకి స్టార్ల చిత్రాలే బెంబేలెత్తిపోయేవి. అందుకే, తమ సినిమాల విడుదల సమయంలో షకీలా సినిమాలు అడ్డు రాకూడదని అప్పట్లో మలయాళ హీరోలు ఓ నిబంధన విధించారు. అయితే, ఆ తర్వాత వారికి షకీలా టెన్షన్ లేకుండాపోయింది. ఆమె హాట్ చిత్రాలు చేయడం మానుకున్నారు. కొంచెం నీట్గా ఉండే పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల తన ఆత్మకథ రాశారు షకీలా. అప్పట్లో షకీలా సినిమాల్లానే ఇప్పుడీ ఈ పుస్తకం హాట్ కేక్లా అమ్ముడుపోయింది. ఈ ఆత్మకథ చదివిన షకీలా ఫ్రెండ్స్.. ‘దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ ఆలోచన షకీలాకి కూడా నచ్చింది. దక్షిణాది భాషలతో పాటు, సౌత్లోనూ షకీలా నటించారు కాబట్టి, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నారామె. కె. తిరుమల్ దర్శకుడు. ఓ ప్రముఖ తారతో తన పాత్రను నటించజేయాలనుకుంటున్నారు షకీలా.