breaking news
Bhuvanangiri Division
-
బినామీ డీలర్లు..!
నీలగిరి : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్లు కాకుండా రేషన్దుకాణాలపై బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బినామీలుగా చెలామణి కావడమేగాక డీలర్ల సంఘానికి నాయకత్వం వహిస్తున్నా, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో గ్రామస్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థపై అజమాయిషీ లేకుండా పోయింది. ఏడాది కాలం తర్వాత శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆహార సలహాసంఘం సమావేశంలో పలువురు సభ్యులు గగ్గోలు పెట్టారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్కార్డులు, ఆధార్ సీడింగ్, ఐకేపీ, ఆహార పదార్థాల్లో కల్తీ వ్యవహారం, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహణపై చర్చించారు. ప్రధానంగా రేషన్ డీలర్ల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. దుకాణాలు తెరవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదన్నారు. ఆలేరులో ఓ డీలరు ఒకే ఇంట్లో రెండు దుకాణాలు నడుపుతున్నాడని ఎమ్మెల్యే గొంగడి సునీత ఫిర్యాదు చేశారు. భువనగిరి డివిజన్ పరిధిలో 35 దుకాణాలు బినామీ చేతుల్లో నడుస్తున్నాయని మరో సభ్యుడు అహ్మద్ అలీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భార్య డీలర్గా ఉన్న ప్రతిచోట భర్త పెత్తనం ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. భువనగిరి పట్టణంలో ఐదుగురు రేషన్డీలర్లు బినామీలుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు రేషన్డీలర్ అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. భువనగిరి డివిజన్ ఏఎస్ఓ డిప్యుటేషన్ మీద హైదరాబాద్ కే పరిమితమయ్యారని...స్థానికంగా జరుగుతున్న అక్రమాల వైపు కనీసం కన్నెత్తికూడా చూడడం లేదని తెలిపారు. వీరిపై చర్య తీసుకోవాల్సిన తహసీల్దార్లు డీలర్లకు కొమ్ముకాస్తున్నారని, ఆర్డీఓకు ఏ మాత్రం సహకరించడం లేదని కలెక్టర్కు వివరించారు. బియ్యం పంపిణీలో అక్రమాలు... సంస్థాన్నారాయణపురం మండలంలో అంత్యోదయ కింద మృతిచెందిన కుటుంబాల పేరు మీద డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రసూల్ తెలిపారు. దీనిపై కొద్ది మాసాల క్రితం అధికారులు విచారణ కూడా నిర్వహించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కన పడేశారని చెప్పారు. పాలలో యూరియా, సోయాబీన్ పిండి కలిపి కల్తీ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పాలల్లో ఎలాంటి కల్తీ జరగడం లేదని చెప్పారు. రేషన్కార్డులు రద్దుకావు ఆధార్ సీడింగ్ నమోదు చేసుకోని రేషన్కార్డుదారులను తొలగిస్తారని వార్తలు వస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిజమైన లబ్ధిదారులను తొలగించబోమని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ నమోదు చే యించుకోవాలని తెలిపారు. లేకపోతే అలాంటి వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం వాటిని తొలగిస్తామని చెప్పారు. మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలు నిర్వహించకుండా నిలిచిపోయిన ఆహార సలహా సంఘం కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీలకు డివిజన్స్థాయిలో ఆర్డీఓ చైర్మన్గా, గ్రామ కమిటీలకు సర్పంచ్, మండల కమిటీలకు కోచైర్మన్లుగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వ్యవహరిస్తారు. గ్రామ సలహాసంఘం కమిటీ సమావేశం నెలకోసారి, మండలస్థాయి కమిటీ సమావేశాలు రెండు మాసాలకోసారి నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, ఫిర్యాదులపై వచ్చే సమావేశం నాటికి చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, సలహా సంఘం కమిటీ సభ్యులు, డీఎస్ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘చీప్’గా చేస్తున్నారు..!
మూతతీయ్.. కల్తీచెయ్ - మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం - భువనగిరి డివిజన్లో కల్తీ మద్యం అమ్మకాలు - అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు భువనగిరి : లాభార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు అడ్డదారులు వెతుకుతున్నారు. యథేచ్ఛగా మద్యా న్ని కల్తీ చేస్తూ మద్యం ప్రియులప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల మద్యం ఫుల్బాటిళ్ల మూతలు తీసి అందులో స్పిరిట్, నీళ్లు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు పట్టణంలో ఈ రకంగా కల్తీ చేసిన మద్యం సీసాలను స్థానికులు ఎక్సైజ్ అధికారులకు పట్టించా రు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. అయితే ఇదంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీకే మద్యా న్ని విక్రయించాలనే నిబంధనను మద్యం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం : ఏడుకొండలు ఎక్సైజ్ సీఐ ఆలేరు ఆలేరులోని ఓ దుకాణంలో మద్యం కల్తీ జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాం. ఆ షాపు నుంచి మద్యం షాంపిళ్లను సేకరించాం. వాటిలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై నిగ్గు తేల్చాలని కోరాం. నివేదిక రాగానే తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం. కల్తీ ఇలా.. మద్యం వ్యాపారులు పలు చోట్ల సిండికేట్గా మారి ప్రతి మండలంలో ఒక హోల్సేల్ దుకాణాన్ని అనధికారికంగా నడుపుతున్నారు. ఆ దుకాణం నుంచి ఆయా మండలాల్లోని బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దీంతో ఎక్కువగా అమ్మకాలు ఉండే దుకాణాన్ని ఎంపిక చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం కల్తీ చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన అనుభవం కలిగిన వ్యక్తులను నియమించినట్లు తెలిసింది. రాత్రి మద్యం దుకాణం మూసే సమయం, లేదంటే ఉదయాన్నే దుకాణంలోకి వచ్చి తాము ఎంచుకున్న బాటిళ్ల మూతలను సీల్ చిరిగిపోకుండా పైకి తీస్తారు. వెంటనే అందులోంచి క్వార్టర్ సీసా మద్యం తీసి కొన్ని నీళ్లు, మరికొంత స్పిరిట్ కలిపి దాని మూతను యథావిథిగా బిగిస్తారు. ఇదంత ఒక గంటలోపు పూర్తి చేస్తారు. అనంతరం ఆయా మద్యం సీసాల నుంచి తీసిన మద్యాన్ని ఒక సీసాలో పోస్తారు. నాలుగు బాటిళ్లకు ఒక బాటిల్ చొప్పున అదనపు మద్యం తయారు చేయడం జరుగుతుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఎక్కువగా అమ్మకాలు ఉన్న బ్రాండ్ మద్యం సీసాల్లో ఈ రకమైన కల్తీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారుల వత్తాసు మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం చేస్తున్నారు. ఇటీవల ఆలేరులో ఇలా పట్టుకున్నసమయంలో ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇది పెద్ద సమస్య కాదని కామన్ అంటూ ఓ అధికారి అన్నట్లు ఫిర్యాదు దారులు ‘సాక్షి’కి చెప్పారు. కాగా ఇప్పటికే ముగిసిన బోనాల పండగ, దసరా,బతుకమ్మ పండగల నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బొమ్మలరామారం, భువ నగిరి,బీబీనగర్ ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలను అధికారులు నిరోదించారు. మళ్లీ పండగల నేపథ్యంలో డివిజన్కు పొరుగన గల హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి నకిలి మద్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.