breaking news
Banking Regulator Head
-
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
బ‘బుల్’ రిస్క్..!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 8 శాతం క్షీణిస్తుందన్న అంచనాల నేపథ్యంలోనూ దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు పరుగులు చేయడంపై స్వయంగా బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘బుడగ పేలే (రిస్క్ ఆఫ్ ఏ బబుల్) అవకాశం ఉంది’’ అని హెచ్చరిక చేసింది. తద్వారా స్టాక్ మార్కెట్ పెరుగుదల నిలబడకపోవచ్చని సూచించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో మార్కెట్కు సంబంధించి ఆర్బీఐ అభిప్రాయాలను క్లుప్లంగా పరిశీలిస్తే... ► భారత్ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ 2021 జనవరి 21న 50,000 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫిబ్రవరి 15న గరిష్టంగా 52,154 పాయింట్లను తాకింది. కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రారంభమయిన నాటి నుంచీ చూస్తే (2020 మార్చి 23 నుంచీ) మార్కెట్ 100.7% పెరిగితే, ఒక్క 2020–21లో 68 శాతం ఎగసింది. ► జీడీపీ క్షీణ అంచనాల నేపథ్యంలోనూ మార్కెట్ భారీ పెరుగుదల ‘బబుల్ రిస్క్’ను సూచిస్తోంది. వాస్తవిక ఆర్థిక క్రియాశీల రికవరీకి అలాగే అసెట్ ప్రైస్ పెరుగుదలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుండడం ఇప్పుడు గ్లోబల్ విధాన నిర్ణయ అంశాల విషయంలో ఆందోళనకు కారణమవుతోంది. ► నిధుల సరఫరా, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడులు స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదలకు కారణం. ఎకానమీ మెరుగుపడుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ పెరుగుదలకు కొంత కారణమయినప్పటికీ, మనీ సప్లై, ఎఫ్పీఐల ప్రభావమే ఇందులో అధికం. ఆర్థిక రికవరీకి వ్యవస్థలోకి మనీ పంప్ చేయడం (లిక్విడిటీ) కూడా అసెట్ ధరల పెరుగుదలకు కారణం. అయితే ఈ తరహా ద్రవ్యలభ్యత, మద్దతు వ్యవస్థలో నియంత్రణ లేకుండా, నిరంతరం కొనసాగుతుందని భావించరాదు. ► భవిష్యత్ ఆర్జనలకు భరోసాను ఇచ్చింది. ► తాజా పరిస్థితిని విశ్లేషిస్తే, మహమ్మారి వేవ్ల కట్టడి జరిగి, ఎకానమీ వాస్తవిక వృద్ధి బాట పట్టే వరకూ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వినియోగం, పెట్టుబడులు కీలకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఆర్థికాభివృద్ధిపై సెకండ్వేవ్ ప్రభావం కొనసాగనుంది. 10.5 శాతం వృద్ధి సాధిస్తామన్న తొలి అంచనాలకు కోత పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కోవిడ్ సవాళ్ల అనంతరం దేశం వృద్ధి బాటన నిలదొక్కుకోవడానికి ప్రైవేటు వినియోగం పెట్టుబడుల మళ్లీ ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్పీఏల పట్ల దృష్టి పెట్టాలి సెకండ్ వేవ్ నేపథ్యంలో మొండి బకాయిల (ఎన్పీఏ) పరిస్థితిని బ్యాంకులు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎన్పీఏల వర్గీకరణపై నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో తగిన స్థాయిలో ప్రొవిజనింగ్ (ఎన్పీఏ కేటాయింపులు)పై దృష్టి పెట్టాలి. తగిన స్థాయిలో లిక్విడిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)తగిన స్థాయిలో ఉండడానికి తగిన అన్ని చర్యలూ తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఎటువంటి అవరోధాలూ లేకుండా ద్రవ్య,పరపతి విధానం కొనసాగేలా చర్యలు ఉంటాయి. బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది 2020–21లో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ పెరిగింది. మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వినియోగదారు నగదు తన వద్ద ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి కారణం. ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నోట్ల సర్క్యులేషన్ విలువ 16.8 శాతం పెరిగితే, పరిమాణం విషయంలో ఇది 7.2 శాతం. 2019–20లో ఈ శాతాలు వరుసగా 14.7 శాతం, 6.6 శాతంగా ఉండడం గమనార్హం. విలువ రీత్యా చూస్తే, 2021 మార్చి 31 నాటికి మొత్తం సర్క్యులేషన్లో రూ.500, రూ.2000 నోట్ల వాటా 85.7 శాతం. ఇది 2020 మార్చి 31 నాటికి 83.4 శాతంగా ఉంది. 2,000 నోటుకు గుడ్బై! రూ.2,000 నోట్లను క్రమంగా పూర్తి స్థాయిలో వ్యవస్థలోంచి వెనక్కు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020–21లో ఆర్బీఐ రూ.57,757 కోట్ల విలువైన రూ.2000 నోట్లకు వ్యవస్థలో నుంచి ఉపసంహరించింది. 2019–20లో 2000 నోట్ల విలువ రూ.5,47, 952 కోట్లు కాగా, 2020–21లో ఈ విలువ రూ.4,90,195 కోట్లకు పడిపోయింది. 2017–18లో ఈ నోట్ల పరిమాణం 33,630 లక్షలు కాగా, 2021 మార్చికి 24,510కి తగ్గింది. ఇక వ్యవస్థలో డిమాండ్ను నెరవేర్చడానికి రూ.500 నోట్లను భారీగా సర్క్యులేషన్లోకి తెస్తోంది. ప్రస్తుత సర్క్యులేషన్ నోట్లలో వీటి వాటా 68.4%. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వాటా 61%. -
ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడికి చైనా కీలక పదవి
ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు గౌ షుకింగ్ కు చైనా కీలక పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. తన దేశపు బ్యాంకింగ్ రెగ్యులేటర్ అధినేతగా గౌను నియమించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రిటైర్ కాబోతున్న షాంగ్ ఫులిన్ స్థానంలో ఆయన నియామకం జరిగిందని తెలిపాయి. అయితే ఈయన నియామకాన్ని చైనా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. చైనా బ్యాంకింగ్ రెగ్యులేటరీ కమిషన్కు గౌన్ను చైర్మన్గా, పార్టీ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ఇంటర్నల్గా సీబీఆర్సీ స్టాఫ్కు తెలిపారని ఓ అధికారి చెప్పారు. అయితే ఈ విషయాన్ని సీబీఆర్బీ ప్రెస్ ఇంకా బయటికి వెల్లడించలేదు. గౌ, 2013లో ఉత్తర చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు గవర్నర్గా అపాయింట్ అయ్యారు. దేశీయ ఆర్థిక ప్రక్రియను సంస్కరించడానికే గౌ తన ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. అంతకముందు చైనా సెక్యురిటీస్ రెగ్యులేటరీ కమిషన్కు ఆయన చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనాన్సియల్ సిస్టమ్లో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు కార్పొరేషన్ కు చైర్మన్ గా, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కు అధినేతగా వ్యవహరించారు. చైనా, గ్లోబల్ కు సంబంధించిన స్థూల ఆర్థికాంశాలపై గౌకు అపారమైన అనుభవం ఉందని ఆసియా మోర్గాన్ స్టాన్లీ మాజీ చైర్మన్ స్టీఫెన్ రోచ్ చెప్పారు. షాడో బ్యాంకింగ్, చైనా బ్యాంకులకు గుదిబండలా మారుతున్న రుణాలు ఆయనకు సవాలుగా నిలవనున్నాయి.