సరైన బ్యాంక్ దొరికితే టేకోవర్కు రెడీ
ముంబై: సరైన పరిమాణం, తగిన ధరకు ఏదైనా బ్యాంకు దొరికితే కొనుగోలు చేయడానికి సిద్ధమేనని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ పేర్కొన్నారు. తమ బ్యాంకు విధానాలకు తగ్గట్టుగా ఉండే బ్యాంకును టేకోవర్ చేసేవిషయంలో ఇంకా వేట మొదలుపెట్టాల్సి ఉందన్నారు. ఇప్పటివరకైతే తమకు అలాంటి బ్యాంక్ తారసపడలేదని చెప్పారు. అయితే, కొనుగోలుకు ఎప్పుడూ రెడీగానే ఉంటామని ఆమె పేర్కొన్నారు. ‘గత 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ 650 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. వీటి వ్యాపార పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఒక కొత్త బ్యాంక్కు సమానంగా ఉంటుంది.
అయితే, కొనుగోలు చేయబోయే బ్యాంక్కు మాత్రం తగిన సైజు కచ్చితంగా ఉండాల్సిందే’ అని ఆమె వివరించారు. గతంలో తాము టేకోవర్ చేసిన బ్యాంకులకు 300-400 బ్రాంచ్లు ఉన్నాయని.. అప్పటి పరిస్థితులకు అది సరిగ్గా సరిపోయిందన్నారు. బ్యాంక్ ఆఫ్ మదుర, సాంగ్లి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్లను ఐసీఐసీఐ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐకి దేశవ్యాప్తంగా 3,750కి పైగా బ్రాంచ్లు ఉన్నాయి. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.54,606 కోట్లు కాగా, నికర లాభం రూ.9,810 కోట్లుగా నమోదైంది. 1984లో అప్పటి ఐసీఐసీఐ లిమిటెడ్లో కెరీర్ను ప్రారంభించిన కొచర్ 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులయ్యారు.