breaking news
balarama avatharam
-
జై బల‘రామ’
శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు కల్యాణ మండపంలో భక్తుల కోలాహలం నేడు శ్రీకృష్ణావతారంలో వైకుంఠ రామయ్య భద్రాచలం టౌన్, న్యూస్లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామివారు బలరామ రూపంలో కనిపించిన వెంటనే భక్తులు నీరాజనాలు పలికారు. ఆదిశేషుని అంశతో జన్మించిన బలరాముడు తమ్ముడు శ్రీ కృష్ణునికి ధర్మస్థాపనలో సహకరించారు. అపరపరాక్రముడిగా పేరొందిన బలరామయ్య రూపంలో భద్రాద్రి రాముని ఆలయ అర్చకులు తీర్చిదిద్దారు. ఆహా..ఏమి ఈ దర్శనభాగ్యం అంటూ భక్తులు పులకించిపోయారు. బుధవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన సేవలు, బేడామండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆళ్వార్లతో కూడిన ఉత్సవమూర్తులకు స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితర అర్చకులు 200 దివ్య ప్రబంధాలను పఠించారు. అనంతరం స్వామివారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్ది సేపు ఉంచారు. అంతరాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన స్వామి వారికి ఆలయ ఈవో ఎం. రఘునాథ్, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపం వ ద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద భక్తుల దర్శనార్థం ఉంచారు. పల్లకిపై విచ్చేసిన స్వామివారికి దారి పొడువునా భక్తులు మొక్కులు చెల్లించారు. వేదిక వద్ద ఆలయ అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందించి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించారు. బలరాముని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఊరేగింపుగా విశ్రాంతి మండపం వరకు తీసుకొచ్చి అక్కడ స్వామివారు కొద్ది సేపుతీరిన తరువాత తాత గుడి సెంటర్లోని గోవిందరాజస్వామి గుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈఓ రఘునాథ్, ఏఈవో శ్రవణ్కుమార్, ఆలయ ప్రధానార్చకులు పోడిచేటి జగన్నాథాచార్యులు, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా, ఆలయ అర్చకులు విజయరాఘవన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నేడు శ్రీ కృష్ణావతారం అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి బోధించి, మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు శ్రీ కృష్ణుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే శుభఫలితాలు చేకూరుతాయని వేదపండితులు చెబుతున్నారు. -
రాములోరొచ్చారు...
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగం గా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి మంగళవారం వైకుంఠరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అర్చకులు ఆరాధన గావించారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు 12 మంది ఆళ్వార్లను కొలువుతీర్చారు. వారికి వేదపండితులు 200 పాశుర పఠనం గావించారు. అంతరాలయంలో వైకుంఠ రాముడిగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం నుంచి భక్తులు జై శ్రీరామ్...జైజై శ్రీరామ్.. అంటూ జయజయధ్వానాలు చేస్తుండగా ప్రత్యేక పల్లకి లో ఊరేగింపుగా స్వామివారిని తీసుకొని వచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకెళ్లారు. కొలువుదీరిన వైకుంఠ రాముని దర్శించుకొని భక్తులు పులకించారు. జగదభి రాముడు..రఘుకుల సోముడు.. నిత్యం వైకుంఠ రాముడిగా అంతరాలయంలో భక్తులచే పూజలందుకునే జగదభిరాముడు...తన ఆశీస్సులను అందించడానికి తమ ముందుకు వచ్చే సరికి భక్తులు ఉప్పొంగిపోయారు. స్వామివారిని చూసి ‘జగదభి రాముడు శ్రీ రాముడే...రఘుకుల సోముడు ఆ రాముడే..’ అంటూ వేనోళ్ల కీర్తించారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణ యే ఉత్తమమైనదని.. అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పాడని, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శపురుషుడు, ధర్మ స్వరూపుడు ఆ వైకుంఠరాముడే అని ఆలయ అర్చకులు రామావతారం విశిష్టతను వివరించారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వైకుంఠ రాముని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు బారు లు తీరారు. స్టేడియం నుంచి రాజ వీధి మీదుగా తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నేడు బలరాముడై.. శ్రీహరికి శయన అయిన ఆదిశేషుని అంశతో జన్మించి.. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న నానుడు కి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి.. శ్రీకృష్ణునికి అన్నగాఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. బలరామావతారంలో బుధవారం దర్శనమిచ్చే స్వామివారిని తిలకిస్తే మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.