-
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
మలుపులే జీవితం
ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బీఎడ్లో సీటు పరీక్ష పెట్టింది. పాఠాలు చెప్పడంలో ఉన్న ఇష్టం.. పర్వతారోహణను పక్కన పెట్టించింది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్గా ఆమె దిశ మారింది. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పెళ్లితో ఆడవాళ్లకు కెరీర్ ఆగిపోకూడదని, భర్త బదిలీలతో పాటుగా కెరీర్ను మలుచుకోవాలన్నారామె. ఆ మలుపులే తనను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా మార్చాయన్నారు. తను సమాజానికి ఎలా ఉపయోగపడాలని భగవంతుడు నిర్ణయించి ఉంటే... తన పయనం ఆ దిశగా సాగుతుందని నమ్ముతున్నారు రేఖారావు. బచేంద్రిపాల్ నేర్పించిన జీవిత జ్ఞానమే తనకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తోందని చెప్తున్నారు రేఖారావు. రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం తో బాల్యం, చదువు జమ్షెడ్పూర్ లో సాగాయి. బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నది కూడా జమ్షెడ్పూర్లోనే. జేఆర్డి టాటా కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’లో శిక్షణ తరగతులు నిర్వహించేవారు బచేంద్రిపాల్. టీనేజ్లో మెదడు మైనపుముద్దలా ఉంటుంది. అప్పుడు పడిన ముద్ర జీవితాన్ని నడిపిస్తుంది. బచేంద్రిపాల్ దగ్గర నేర్చుకున్నది పర్వతారోహణ మాత్రమే కాదు, సామాజిక జీవి అయిన మనిషి ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా మెలగాలనే జ్ఞానాన్ని కూడా. ఆ శిక్షణతోపాటు ఆర్మీ నేపథ్యం కూడా తన మానసిక వికాసంలో కీలకమేనంటారు రేఖ. ‘‘పర్వతారోహణ శిక్షణలో ఉన్నప్పుడు నాకు భారతీయత అర్థమైంది. మేము గురువు పాదాలకు నమస్కారం చేస్తాం. సాహసమే జీవితంగా భావిస్తాం. ఆడపిల్లలకు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకనే మాట వినిపించేది కాదు. దేహం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మానసికంగా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు. సాహసోపేతమైన క్రీడలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలిగిన మంచి లక్షణం కూడా అబ్బుతుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఏవీ బాధించనంత గా పరిణతి వచ్చేస్తుంది. అలాగని వైరాగ్య జీవనమూ కాదు. జీవితం విలువ తెలుస్తుంది. బతికున్న ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపడం అలవడుతుంది. అందుకే పిల్లలకు ఆటలు లేని విద్యాభ్యాసాన్ని అంగీకరించలేను. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర టీచర్ దే. ప్రభుత్వ పాఠశాలను దత్తత ఇస్తే అద్భుతాలు చేయవచ్చని కూడా అనిపిస్తుంటుంది. నన్ను ఆహ్వానించిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇస్తున్నాను’’ అని చెప్పారు రేఖ. ఉత్తర శిఖరం.. దక్షిణాపథం కశ్మీర్లోని లేహ్, లధాక్, శ్రీనగర్, అమృత్సర్ నుంచి చంఢీఘర్, భటిండా, అస్సాం, నాసిక్, బెంగుళూరు కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాల్లో నివసించాను. మనదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యతతోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూడగలిగాను. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేయగలగడానికి అప్పటి సామాజిక అధ్యయనం చాలా దోహదం చేసింది. ప్రాంతం, భాష ఏదైనా సరే... ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఒకటే. మంచి పరిపాలన. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ఫలాల పట్ల నిశితమైన గమనింపు ఉంటుంది. చదువు రాని వాళ్లలో రాజకీయ చైతన్యం ఉండదని మేధావులు భావిస్తుంటారు. కానీ తమ ప్రయోజనాల గురించిన చైతన్యాన్ని కలిగి ఉంటారు. కరెంటు, టీవీ, రేడియో లేని కుగ్రామాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తమకు అవసరమైన మేరకు తెలుసుకుంటూనే ఉంటారు. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం మాత్రం తీవ్రంగా ఉంది. గ్రామాలనే కాదు, మహానగరాల్లోని బస్తీల్లో కూడా సమతులాహారం తినడం తెలియదు. ఎక్కువమంది ఒబేసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. బస్తీల్లో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కరోనా సమయంలో ఇంటికి పరిమితం కాకుండా ఎక్కడ సహాయం అవసరమైతే రాచకొండ పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తూ ఒక వారధి గా పని చేశాను. బస్తీల్లో పదోతరగతి ఫెయిలయ్యి చదువు మానేసిన పిల్లలు ఎక్కువగా కనిపిస్తారు. ఆ పిల్లలు అసాంఘిక శక్తులుగా పరిణమించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న మనందరి మీదా ఉంది. చదువు మీద ఆసక్తి లేకపోతే బలవంతం వద్దు, నీకు ఏ పని చేయడం ఇష్టమో చెప్పు, నేర్పిస్తానని అడిగితే పిల్లలు చక్కగా ఓపెన్ అవుతారు. టైలర్ కావాలని ఉంటే అదే పని చేయాలి. వంట చేయడం ఇష్టమైతే అదే చేయాలి. ఏది చేసినా అందులో నువ్వే బెస్ట్ అనిపించుకునేటట్లు నైపుణ్యాన్ని సాధించాలి... అని చెప్పినప్పుడు పిల్లలతోపాటు ఆ తల్లిదండ్రులు కూడా ఒక దారి కనిపించినట్లు సంతోషపడతారు. ఇలా భగవంతుడు నాకిచ్చిన నైపుణ్యం ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్నాను’’ అన్నారు రేఖారావు. పర్వతారోహణ శిక్షణ అనంతరం బచేంద్రీపాల్ నుంచి సర్టిఫికేట్ అందుకుంటున్న రేఖ మైక్ పట్టుకుని కామెంటరీ ఇవ్వడం అంటే నాకు చెప్పలేనంత. ఎంతగా అంటే... పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్లో కామెంటరీ అవకాశం కోసం ఐదేళ్ల పాటు ప్రయత్నించి సఫలమయ్యాను. అలాగే హైకోర్టు వందేళ్ల వేడుకల్లోనూ కామెంటరీ ఇవ్వగలిగాను. ‘నాట్ పాజిబుల్’ అన్నవాళ్లే ఇప్పుడు ‘పలానా రోజు ప్రోగ్రామ్. కామెంటరీ ఇవ్వడానికి మీకు వీలవుతుందా’ అని అడిగినప్పుడు ఎవరెస్టును అధిరోహించినంతగా సంతోషపడ్డాను. అలాగే 150 దేశాల ప్రతినిధులు హాజరైన సభలో అన్నా హజారే, బబితా పోగట్ల ప్రసంగాన్ని ఇంగ్లిష్లో అనువదించడం కూడా నన్ను నేను గర్వంగా తలుచుకోగలిగిన క్షణాలు. – రేఖారావు స్కిల్ ట్రైనర్ – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
వివరం: స్ఫూర్తి శిఖరాలు
శిఖరం కన్న సంకల్పబలం ఎత్తైదని నిరూపించిన భారతీయ మహిళలు వీరంతా! బచేంద్రీపాల్ మొదలు... ఒంటికాలితో ఎవరెస్టును ఎక్కిన అరుణిమ సిన్హా వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. అందరిదీ ఒకే పట్టుదల. అందుకే వీరు స్ఫూర్తి శిఖరాలయ్యారు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం ఏది? ప్రశ్న పూర్తయే లోపు ‘ఎవరెస్టు’ అనే సమాధానం వస్తుంది. 29,029 అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాల్లో మహలాంగుర్ సెక్షన్లో ఉంది ఎవరెస్టు శిఖరం. దీనిని నేపాలీయులు ‘సాగర్మాత’ అనీ, టిబెట్ వాసులు చోమోలుంగ్మా అనీ పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా... శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడమే దాని గొప్పదనం. అయితే, ‘ఆ గొప్పదనమేంటో మేమూ చూస్తాం’ అంటూ ఎగబాకుతారు సాహసికులు. ఎవరెస్టును అధిరోహించిన సాహసికుల్లో... ఏడడుగులే కాదు, శిఖరయానం కూడా కలిసే అంటూ ఎవరెస్టునెక్కిన దంపతులు మరీజా, ఆమె భర్త యాండ్రెజ్ స్ట్రెమ్ఫెల్జ్... అరవైలలో ఒకసారి, డెబ్బైలలో మరోసారి ఎవరెస్టు ఎక్కిన రికార్డు నాది అంటూ టేమీ వాటనబుల్... ఇప్పటికి ఇరవైసార్లకు పైగా ఎక్కాను తెలుసా అంటూ అపా షెర్పా... ఇలా ప్రపంచదేశాల నుంచి లెక్కలేనంత మంది ఎవరెస్టును అధిరోహించి తమ కీర్తిని శిఖర స్థాయికి చేర్చుకున్నారు. ఈ అధిరోహణలో భారతీయుల స్థానం కూడా తక్కువేం కాదు. ఈ పరంపరకు తొలి అడుగు బచేంద్రిపాల్. ఆ తర్వాత తండోపతండాల్! ఆ మహిళల అడుగులే ఈవారం మన ‘వివరం’. బచేంద్రిపాల్: ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్. ఆమె 1984 మే నెల 23న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. బచేంద్రిపాల్ భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్టును అధిరోహణకు పూనుకున్న ప్రతి పర్వతారోహకులూ ఒక్కసారైనా ఆమెను కలవాలనీ, సూచనలను తీసుకోవాలనీ, ఆమెతో ఫొటో తీసుకోవాలనీ ఉవ్విళ్లూరినవారే. బచేంద్రిపాల్ 1954 మే నెల 24వ తేదీన జన్మించారు. అంటే నిన్నటికి అరవై ఏళ్ల కిందట అన్నమాట. విశేషం ఏమిటంటే... ఆమె ఎవరెస్టును అధిరోహించింది 1984 మే నెలలోనే తన పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్టు శిఖరానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడచిన ముప్ఫై ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖరస్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలాకాలంగా పర్వతారోహణలో మహిళలకు (పురుషులకు కూడా) శిక్షణనిస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రికార్డులకంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నకురి గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బచేంద్రిపాల్. ఆ తర్వాత ఆమె సంస్కృతంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తొలిసారి పర్వతారోహణ చేసింది పన్నెండేళ్ల వయసులో. స్కూలు విద్యార్థులతోపాటు పిక్నిక్లో భాగంగా 13, 123 అడుగుల పర్వతాన్ని అధిరోహించారు. సంతోష్యాదవ్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండవ భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఆమె 1992, 1993లలో మే నెలలో ఎవరెస్టును అధిరోహించారు. అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించారు. సంతోష్ యాదవ్1967 అక్టోబర్ 10న జన్మించారు. ఆమెది హర్యానా రాష్ట్రం, రెవారీ జిల్లాలో జోనియావాస్ గ్రామం. జైపూర్లోని మహారాణి కాలేజ్లో చదివారు. ఉత్తరకాశిలోని కస్తూర్బా హాస్టల్లో ఉంటూ ‘నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్’ సంస్థలో శిక్షణ పొందారు. ఆమె ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు చదువుతూనే పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె ఇండో- టిబెట్ సరిహద్దు పోలీస్ అధికారి. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కల్పనా దాస్: 2008, మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని చేరారు. అది ఆమెకు మూడవ ప్రయత్నం. ప్రతికూలమైన వాతావరణపరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈమె 2004, 2006లలో రెండుసార్లు విఫలమయ్యారు. మొదటిసారి 7,300 మీటర్లు, రెండవసారి 8, 048 మీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగారు. మూడవ ప్రయత్నానికి ముందు బచేంద్రిపాల్ను కలిసి సలహా తీసుకున్నట్లు ఆమె చెప్తారు. కల్పనాదాస్ 1966 జూలై 7వ తేదీన ఒరిస్సా రాష్ట్రం థేన్కానల్ జిల్లా సరియాపారా గ్రామంలో జన్మించారు. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల, మా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల అత్యంత ఎత్తై శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించగలిగాను. విఘ్నాలను అధిగమిస్తూ శిఖరాన్ని చేరడంతోపాటు అంతే క్షేమంగా వెనక్కు రాగలిగాను. ఆ శిఖరాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించాలనుంది’’ అన్నారామె. ప్రస్తుతం ఆమె థేన్కానల్ పట్టణంలో నివసిస్తున్నారు. ప్రేమలతా అగర్వాల్: 2011, మే నెల 20వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతోపాటు ఆమెకు ‘ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళల్లో పెద్ద వయస్కురాలిగా’ మరో రికార్డు కూడా ఉంది. ఎవరెస్టు ఎక్కేనాటికి ఆమె వయసు 45 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఎవరెస్టు ఎక్కే నాటికే పెద్దమ్మాయికి వివాహమైంది కూడ. జార్ఖండ్కు చెందిన ప్రేమలత గృహిణి. ఆమె భర్త విమల్ అగర్వాల్ సీనియర్ పాత్రికేయులు. ఎవరెస్టు ఆరోహణకు ముందు ఆమె 40 రోజుల పాటు ఎడారిలో పర్యటించారు. థార్ డెజర్ట్ ఎక్స్పిడిషన్లో భాగంగా ఆమె గుజరాత్ లోని భుజ్ ప్రాంతం నుంచి పంజాబ్లోని అట్టారి (వాఘా బోర్డరు) వరకు ఒంటె మీద సవారీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఆఫ్రికాలో ఎత్తై శిఖరం కిలిమంజరో అగ్నిపర్వత శిఖరాన్నీ, అర్జెంటీనాలోని మౌంట్ అకాంగువా శిఖరాన్నీ అధిరోహించారు. ఆమె తన పెద్ద కూతురు ప్రియాన్ష తోపాటు టాటా స్టీల్ అడ్వెంచర్ ఇన్స్ట్యూట్లో బచేంద్రిపాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. విద్యాపతీ దేవి: 2013, మే 17వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిపేరు నింగ్తోజమ్ విద్యాపతీదేవి. ఆ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఆమె ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల ఆరోహణ మొదలు పెట్టిన వీరి బృందం ఏప్రిల్ నెలాఖరుకు 24,000 అడుగుల ఎత్తులో ఉన్న మూడవ క్యాంపుకు చేరింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ వాతావరణంలో కొనసాగుతూ మే నెల 17వ తేదీకి శిఖరాన్ని చేరారు. విద్యాపతీదేవి 2004లో ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణలో శిక్షణ పొందారు. దీనితోపాటు సియాచిన్ గ్లేసియర్లో వింటర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశారు. లైజన్ ఆఫీసర్ కోర్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆల్పైన్ కోర్సు, మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్సులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె మణిపూర్ మౌంటనియరింగ్ ట్రెకింగ్ అసోసియేషన్లో అడ్వెంచర్ ఇన్స్ట్రక్టర్గా కొనసాగుతున్నారు. విద్యాపతీదేవి ఎవరెస్టు ఎక్స్పెడిషన్ని మణిపూర్లోని ‘మణిపూర్ మౌంటనియరింగ్ అండ్ ట్రెక్కింగ్ అసోసియేషన్’ నిర్వహించారు. ఈ బృందంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్షు జామ్సెన్పా కూడా ఉన్నారు. వాన్షుక్ మిర్తాంగ్: ఈమె మేఘాలయకు చెందిన ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుల్. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 16 మంది పర్వతారోహకుల బృందంతోపాటు ఈమె 2013 మే నెల 17వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. వీరు బృందాలుగా విడిపోయి ఆరోహణ కొనసాగించారు. మొదటి బృందంలో విద్యాపతీదేవితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆరుగురితో కూడిన రెండవ బృందంలో వాన్షుక్ ఉన్నారు. వాన్షుక్ ‘నార్త్ ఈస్ట్ జోన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కమిటీ’ నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2006లలో మేఘాలయ పోలీస్ శాఖలో చేరిన వాన్షుక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఔలి’ లో ఉన్న మౌంటనియరింగ్ అండ్ స్కీయింగ్ ఇన్స్టిట్యూట్లో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. చందా గయేన్: 2013, మే నెల 18వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. హౌరాలో నివసిస్తున్న చందా ఈ రికార్డును సాధించిన బెంగాలీ మహిళ. డార్జిలింగ్లోని ‘హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్’లో ఆమె శిక్షణ పొందారు. ఎవరెస్టు అరోహణకు ముందు ఆమె గర్వాల్ జిల్లాలోని జోగిన్ శిఖరాలను, హిమాచల్ ప్రదేశ్లోని మనిరంగ్ శిఖరాన్ని అధిరోహించారు. కరాటే వంటి యుద్ధకళల్లో ప్రావీణ్యత సాధించిన చందా గయేన్ ఆత్మరక్షణ మెళకువలు నేర్పించే ఉపాధ్యాయిని. తన తల్లి జయా గయేన్ నుంచి స్ఫూర్తి పొందారు. జయాగయేన్కు ట్రెకింగ్ హాబీ. చందాగయేన్ రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్, మౌంటనియరింగ్లలో శిక్షణ పొందారు. చందా డార్జిలింగ్లో హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణ సాధన చేశారు. దీంతోపాటు హిమాలయన్ నేచర్ అండ్ అడ్వెంచర్ ఫౌండేషన్ నిర్వహించిన అడ్వెంచర్ ట్రెకింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ఆమె స్విమ్మింగ్, కబడీ, ఎన్సిసి, మార్షల్ ఆర్ట్స్, మౌంటనియరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్తోపాటుగా పాటలు పాడడంలో కూడా సుశిక్షితురాలు. జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చాంపియన్షిప్, కరాటే చాంపియన్షిప్లు సాధించారు. తాషి మాలిక్, నాంగ్షి మాలిక్: ఈ అక్కాచెల్లెళ్లు ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలు. వీరు 2013 మే 19వ తేదీన శిఖరాన్ని చేరారు. అప్పటికి వారి వయసు 21 ఏళ్లు. వీరిది హర్యానాలోని సోనీపత్ జిల్లా. వీరి తండ్రి కల్నల్ వీరేంద్రసింగ్ మాలిక్ మిలటరీలో ఉద్యోగం చేసి డెహ్రాడూన్లో రిటైరవడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. వీరు 2010లో ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం, గుల్మార్గ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటనియరింగ్లో శిక్షణ పొందారు. పాఠశాల స్థాయి నుంచి ఆటల్లో, సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం వీరిది. జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఏడు శిఖరాల అధిరోహణలో భాగంగా ఇప్పటికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలలోని శిఖరాలను అధిరోహించారు. ఇండోనేసియా, యుఎస్, అంటార్కిటికాలలోని శిఖరాలను ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అరుణిమా సిన్హా : 2013, మే 22వ తేదీన శిఖరాన్ని చేరారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అరుణిమా సిన్హా. ప్రమాదవశాత్తూ ఒక కాలిని కోల్పోయిన తర్వాత అందరూ తన మీద చూపించే సానుభూతికి సమాధానంగా ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణిమ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. మూడేళ్ల కిందట ఒకసారి అరుణిమ రైలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమె పర్సును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటనలో దొంగలు ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలు నుజ్జనుజ్జయింది. ఆమెను బతికించాలంటే ఆ కాలిని తీసేయడమే మార్గం అని తేల్చేశారు డాక్టర్లు. ఆమె ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ... ‘కాలు పోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు...’ అని నిరూపించడానికే ఈ సాహసం చేశానన్నారు. తన సాహసయాత్రను ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ స్పాన్సర్ చేసింది. వ్యక్తిగతంగా వీళ్లే కాకుండా, 2005లో అంతా మహిళలే ఉండే ‘ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్పెడిషన్’ జరిగింది. భారతీయ సైనిక రంగానికి చెందిన మహిళల బృందం ఎవరెస్టును అధిరోహించి వచ్చింది. ఇక ఈ ఏడాది (2014) ఏప్రిల్ 18వ తేదీన శిఖరం మీద జరిగిన ప్రకృతి వైపరీత్యం కారణంగా 16 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన కారణంగా ఈ ఏడాది ఎవరెస్టు శిఖరారోహణను నిషేధించారు. అలా జరగకపోయి ఉంటే ఈ మే నెల మరికొంత మంది మహిళలను ఎవరెస్టు శిఖరంపై ఖాయంగా నిలబెట్టి ఉండేదే.ఎవరెస్టు శిఖరం అన్నిటి కన్నా ఎత్తయినది కావచ్చు. అయితే మహిళల సంకల్పబలం ఎవరెస్టును మించినదని ఈ పది మంది మహిళా పర్వతారోహకులు నిరూపించారు. - వాకా మంజులారెడ్డి
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement