breaking news
Babli gates
-
బాబ్లీ నుంచి నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కారు నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1వ తేదీన దిగువకు 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఈ మేరకు గురువారం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏటా జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేయాలి. అనంతరం అక్టోబర్ 28న బాబ్లీ గేట్లు మూసివేస్తారు. అయితే గేట్లు మూసివేసిన తరువాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ, బాబ్లీ ప్రాజెక్ట్ దిగువ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలవడం, ఆ నీరు ఎస్సారెస్పీకి చేరకపోవడాన్ని భర్తీ చేసేందుకుగాను, మార్చి 1వ తేదీన 0.6టీఎంసీల నీటిని బాబ్లీ నుంచి విడుదల చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో భాగంగా గురువారం నీటి విడుదల చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాజెక్ట్ ఈఈ రామారావు, సీడబ్ల్యూసీ నుంచి ఈఈ శ్రీనివాస్, మహారాష్ట్ర నుంచి నాందేడ్ ఈఈ సెటే, తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠకు తెర.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1న 0.6 టీఎంసీల నీటి విడుదల చేపట్టాలి. అయితే బాబ్లీ ప్రాజెక్ట్లో నీరు లేదని ప్రస్తుతం నీటి విడుదల చేపట్టలేమని మహారాష్ట్ర అధికారులు ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాయడంతో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నీటి విడుదల చేపట్టాలని ఎస్సారెస్పీ అధికారులు ప్రతి లేఖ రాశారు. దీంతో బాబ్లీ నుంచి నీటి విడుదల చేపడుతారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సుప్రీం తీర్పు మేరకు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నీటి విడుదల చేపట్టడంతో ఉత్కంఠకు తెర పడింది. 0.3 టీఎంసీల నీరు చేరే అవకాశం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువప్రాంతం నుంచి 0.3 టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని గోదావరి పరీవాహక çప్రాంతాలను దాటుతూ నీరు రావాల్సి ఉండడంతో ఎస్సారెస్పీలోకి కనీసం సగం నీరు అయినా చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత
సాక్షి, కరీంనగర్/బాల్కొండ: మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటి మట్టం 90 టీఎంసీల నుంచి 9.22 టీఎంసీలకు, ఎల్ఎండీలో 24 టీఎంసీల నుంచి 7.04 టీఎంసీలకు తగ్గింది. ఇదే సమయంలో గతం లో వెలువడిన సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనుండటంతో ‘మహా’వరదపై ఆశలు పెరుగుతు న్నాయి. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉండటం వల్ల ఈ నాలుగు మాసాలు మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి నదీ ప్రవాహం ద్వారా భారీగా నీరు చేరే అవకాశం ఉంది. అయితే.. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, విష్ణుపురి, గైక్వాడ్ తదితర 11 ప్రాజెక్టులు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఏడాదిలో నాలుగు నెలలు (వర్షాకాలం) ఎత్తాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏటా జూన్ 30న అర్ధరాత్రి తర్వాత గేట్లు ఎత్తుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మహారాష్ట్ర ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు డెడ్స్టోరేజీకి చేరాయి. గతేడాది కురిసిన వర్షాలకు అక్కడ, ఇక్కడ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఎస్సారెస్పీకి పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు వరద నీరు చేరగా, సుమారు 102 టీఎంసీలు గోదావరిలోకే వదిలేసి 90 టీఎంసీలు నిల్వ చేశారు. ఈసారి కూడా బాబ్లీ గేట్లు తెరుస్తున్నందున మహారాష్ట్ర వరద నీరుపైనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.