breaking news
Attacked by terrorists
-
భారత్పై అణుదాడి చేద్దామనుకున్నా
ముషార్రఫ్ వెల్లడి దుబాయ్: 2002 ఏడాదిలో భారత్పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు. అణ్వాయుధాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించగా ‘అప్పటికి క్షిపణులు అణ్వస్త్రాలతో సిద్ధంగా లేవు. ఆదేశాలు ఇచ్చి ఉంటే మరో రెండు రోజులకు సిద్ధమయ్యేవి. కానీ క్షిపణులకు వార్హెడ్లను అమర్చాలన్న ఆదేశాలను కూడా నేను ఇవ్వలేదు’ అని ముషార్రఫ్ చెప్పారు. 1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. -
టెర్రర్ & టెన్షన్
జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ వెళుతున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది కాలంలోనే జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిందట. 2017 జూన్ 30 నాటికి ఏడాది కాలంలో టెర్రరిజం సంబంధిత మరణాల సంఖ్య 45 శాతం పెరిగాయట. ఇందులోనూ పౌరుల మరణాల సంఖ్య ఏకంగా 164 శాతం పెరిగిందట. ఢిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్(ఎస్ఏటీపీ) ఈ గణాంకాలను వెల్లడించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. పెరిగిన భద్రతా సిబ్బంది,పౌరుల మరణాలు 2016లో బుర్హాన్ వనీ మరణానికి ముందు ఏడాది 51 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. వనీ మరణం తర్వాత ఏడాదిలో ఆ సంఖ్య 98కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఉగ్రవాదుల హింస రెట్టింపైందని ఎస్ఏటీపీ వెల్లడించింది. పౌరులు, భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మరణాల సంఖ్య 45 శాతం పెరిగింది. 2015–16లో ఈ సంఖ్య 216గా ఉంటే.. 2016–17కి వచ్చే సరికి అది 313కి చేరింది. గత ఐదేళ్లుగా ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందులోనూ ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో పౌరుల మరణాల సంఖ్య 164 శాతం పెరిగింది. 2015–16లో ఈ సంఖ్య 14గా ఉంటే.. 2016–17లో ఇది 37 శాతం పెరిగింది. ఇక 2016–17లో ఉగ్రవాదుల మరణాల సంఖ్య 18 శాతం పెరిగి 178కి చేరింది. యూపీఏ పాలన చివరి మూడేళ్లతో పోలిస్తే.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య 42 శాతం పెరిగింది. అమర్నాథ్ యాత్రికులపై దాడులు 18ఏళ్లు 5దాడులు 52మంది మృతి 2000వ సంవత్సరం ఆగస్టు 1న పహల్గావ్ దాడిలో 21 మంది మృతి తాజా దాడి కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, సోషల్ మీడియా బ్యాన్ను ఎత్తేసిన కొద్ది గంటల్లోనే జరిగింది. హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు బుర్హాన్ వనీ చనిపోయి ఏడాదైన కారణంగా దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు కొద్దిరోజుల క్రితం ఆంక్షలు విధించారు.