breaking news
ATM accused
-
అదిగో.. ఏటీఎం నిందితుడు!
రాయదుర్గం, న్యూస్లైన్: బెంగళూరులోని ఏటీఎం సెంటర్లో కార్పొరేషన్ బ్యాంక్ మహిళా మేనేజర్పై దాడి చేసి.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు కనిపించాడంటూ బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వివరాలిలా... బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకోవడానికి స్థానిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్దనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలోకి వెళ్లాడు. అతను బెంగళూరు ఏటీఎం నిందితుడి పోలికలతో ఉండడంతో సెక్యూరిటీ గార్డు పూల చంద్ర శేఖర్ ‘పట్టుకోండి.. పట్టుకోండి..’ అంటూ కేకలు వేశాడు. ఆలోగా ఆ వ్యక్తి బయటకు వచ్చి తన ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో ముమ్మురంగా గాలించారు. కాగా ఉదయం ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన వ్యక్తి సాయంత్రం అదే మార్గంలో వెళుతుండగా సెక్యూరిటీ గార్డు అతన్ని గమనించి పోలీసులకు చూపించాడు. వారు అతన్ని ఆపి విచారించారు. అతను మండలంలోని చదం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి అని, అతను నిందితుడు కాదని తేల్చారు. నిందితుడి పోలికలు ఉండడంతో సెక్యూరిటీ గార్డు పొరబడ్డాడని నిర్ధారించారు. -
అనంతపురం జిల్లాలో కలకలం
అనంతపురం: బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్పై దాడి చేసిన నిందితుడిని పోలి ఉన్న వ్యక్తి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కనిపించాడు. ఎస్బిఐ ఏటిఎం వద్ద సెక్యూరిటీ గార్డ్ అతనిని గుర్తించాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో గత నెల 10న ప్రమీలమ్మ అనే మహిళను చంపిన హంతకుడు, 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి,19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. అతను సైకో కావడంతో అతనిని పోలిన వ్యక్తే ఈ రోజు రాయదుర్గంలో కనిపించాడని తెలియడంతో ఎవరిని ఏం చేస్తాడోనన్న భయం కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే అతను ఆ బెంగళూరు నిందితుడు కాదని పోలీసులు నిర్ధారించారు. రాయదురం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. అందులో ఏటిఎంకు వచ్చినది బెంగళూరు నిందితుడు కాదని వారు చెప్పారు.