breaking news
are entitled to
-
గుండె కోత
సామాజిక భద్రతా పింఛన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా కొత్త పేరు పెట్టి పింఛను సొమ్మును ఐదురెట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం అమలుకు వచ్చే సరికి అర్హులకే ఎసరు పెట్టింది. కొత్తగా ఆసరా కోసం ఎదురు చూస్తున్న వేలాదిమందికి ఆశాభంగం కలిగించింది. సవాలక్ష సాకులు చూపించి జిల్లాల్లో గత నెల్లో 65 వేల పైచిలుకు పింఛన్దారులకు అన్యాయం చేసింది. కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. పలుచోట్ల కమిటీలు అర్హులని తేల్చినా జాబితాల్లో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి ఆసరా కోసం ఎదురు చూస్తున్న వారకి ప్రభుత్వం గుండె కోతను మిగిల్చింది. నెల్లూరు(హరనాథపురం) : ఎన్టీఆర్ భరోసా పథకం ప్రారంభం కాక ముందు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 2,58,382 ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా అమలులోకి వచ్చాక వాటిలో 65,446 మంది పింఛన్లను అక్టోబర్ నుంచి నిలిపి వేశారు. వారిలో 26,509 మందిని శాశ్వత అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలు చూపించారు. అర్హులుగా గుర్తించిన జాబితాను స్టేట్ రెసిడెంట్ డేటా హబ్(ఎస్ఆర్డీహెచ్) ఆధారంగా అన్లైన్ అనుసంధానించే సమయంలో ఆధార్, రేషన్ కార్డులలో వయసుల్లో వ్యత్యాసం ఉందని, స్త్రీకి బదులు పురుషుడనో, పురుషుడికి బదులు స్త్రీ అనో ఉందనో, పరిమితికి మించిన పొలం ఉందనో... ఇలా పలు రకాల కారణాలతో 38,957 మంది పింఛనుదారులను అనర్హులుగా మార్చారు. నెల్లూరు నగరంలో సెప్టెంబర్లో 20,826 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. అక్టోబర్లో ఈ సంఖ్యను 15,401కి కుదించారు. 1634 మందికి ఆధార్ సీడింగ్లో సాంకేతిక అంశాలు కారణాలతో, 3505 మంది పూర్తి అనర్హులని ప్రకటించారు. సదరం సర్టిఫికెట్లు అందజేయలేదని 286 మంది వికలాంగులను పక్కన పెట్టారు. ఈ కోత చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛనుదారుల జాబితాను అడ్డంగా కోసేశారు. జిల్లా వ్యాపితంగా వృద్ధాప్య, చేనేత, వితంతు, వికలాంగ, కల్లుగీత కార్మికుల పింఛన్ల కోసం కొత్తగా 35,927 మంది దరఖాస్తు చేసుకుంటే 18,195 మందిని జాబితా నుంచి తొలగించారు. ఈ జాబితాలు ఆయా గ్రామ కమిటీల సిఫార్సుతో మండల కమిటీల నుంచి జిల్లా యంత్రాంగానికి వచ్చినవే. అటువంటి జాబితాల్లో కూడా కోత వేయడంలో ఔచిత్యంమేమిటని పింఛన్లకోసం పడిగాపులు పడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు. కమిటీ సిఫార్సులను పట్టించుకోని వైనం జిల్లా వ్యాపితంగా ప్రతి గ్రామ సర్పంచ్ చైర్మన్గా, ఎంపీటీసీ మెంబర్గా, ఆయా వర్గాల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు(టీడీపీ నేతలు), మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్...ఇలా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిపి కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు చెప్పిందే తుది నిర్ణయం అని అంతా అనుకున్నారు. అందుకే కమిటీల్లో చోటుకోసం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీకూడా కన్పించింది. అప్పుడేమో కమిటీలదే తుది నిర్ణయమని, ఇప్పుడేమో సవాలక్ష సాకులు చూపించి కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని, కమిటీల్లో వేసింది తమను బలిపశువులను చేయడం కోసమేనా అని సభ్యులు మండిపడుతున్నారు. స్థానిక కమిటీలు పింఛన్లకు అర్హతను నిర్ధారించి మండల కమిటీల ద్వారా జిల్లా యంత్రాంగానికి పంపించిన జాబితాలను కాగితాలకే పరిమితం చేసి, ఆశగా ఎదురు చూస్తున్న వారికి నిరాశనే మిగిల్చారు. డెత్సర్టిఫికెట్ తెమ్మంటున్నారు : నా భర్త చనిపోయి 30 ఏళ్లు అవుతోంది. నెల నెలా వితంతు పింఛను అందుకుంటున్నా. నాభర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ చూపించలేదని నాకు పింఛను తొలగించారు. ఎప్పుడో చనిపోయిన నాభర్త సర్టిఫికెట్ ఇప్పుడు ఎలా చూపించేది. నాకు వస్తున్న కొద్దిపాటి పింఛను ఎంతో ఆధారంగా ఉండేది. మానవతా ధృక్పథంతో నాకు పింఛను పునరుద్ధరించాలి. - నసీమా, మహాత్మగాంధీనగర్, నెల్లూరు మా ఇంట్లో రెండో పింఛను అని తొలగించారు : నాకు 80 ఏళ్లు. నేను అంధుడను. వృద్ధాప్యంతో, పేదరికంలో ఉన్న నాకు వికలాంగుల కోటాలో వస్తున్న పింఛన్ సొమ్ము ఎంతో ఆదుకుంటోంది. నా భార్యకు వృద్ధాప్య పింఛను వస్తుందన్న సాకుతో నాకు పింఛన్ రద్దు చేశారు. ఒక ఇంట్ల్లో ఒకరికే పింఛను అంటూ ప్రభుత్వం నాకు పింఛను రద్దు చేయడం న్యాయమా? - షేక్ నబీసా, గాంధీనగర్, నెల్లూరు పింఛన్ తొలగించారు : నా రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. పదేళ్లుగా నాకు పింఛన్ వస్తుండేది. ఇప్పుడు పెరిగిన పింఛన్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశా. రకరకాల కారణాలు చూపుతూ వస్తున్న పింఛన్ను అధికారులు తొలగిం చారు. నాకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. - షేక్.జాకీర్, వికలాంగుడు. వీఎంఆర్ నగర్, నెల్లూరు. ఆధార్ కార్డులో తప్పు ఉందని నా పేరు తొలగించారు : నాకు 75 ఏళ్లు. ఆధార్కార్డులో తప్పులు ఉన్నాయని నాకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ను తొలగించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి దయవల్ల పదేళ్లుగా పింఛను అందుకుంటున్నాను. చంద్రబాబు పింఛను పెంచుతారని అనుకుంటే.. వస్తున్న పింఛను తొలగించారు. నాకు పింఛన్ను పునరుద్ధరించాలి. - షేక్ కాలేషా, డైకస్ రోడ్డు సెంటర్, నెల్లూరు అర్హత గల వారికే పింఛను మంజూరు : జిల్లా వ్యాపితంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగినవారికే పింఛను మంజూరు చేస్తాం. నూతనంగా దరఖాస్తు చేసున్న వారిలో 17 వేల మందిని అర్హులుగా గుర్తించాం. వీరికి త్వరలో పింఛను పంపిణీ చేస్తాం. తొలగించిన జాబితాలో ఎవరైనా అర్హులు ఉంటే సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తాం. - చంద్రమౌళి, పీడీ, డీఆర్డీఏ -
ఎట్టా బతకాలి ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అవసాన దశలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు వారి పొట్టగొడుతున్నాయి. రకరకాల నిబంధనల పేరుతో అర్హులను సైతం తొలగిస్తూ వారికి కడుపుకోత మిగుల్చు తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ఇస్తున్న సామాజిక భద్రతా పించన్లను రూ.70 నుంచి రూ.200, రూ.500కు పెంచి వారికి భరోసా ఇచ్చారు. అదే విధంగా మరికొందరు లబ్ధిదారులను గుర్తించి వారికీ అప్పటి ప్రభుత్వం అండగా నిలిచింది. అయితే వైఎస్సార్ మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు వారికిచ్చే భృతికి కోతేయడంపై కన్నేశాయి. ఆధార్, రేషన్కార్డు లేనివారిని, నివాసం, కొద్దోగొప్పో భూమి ఉన్న వారిని తొలగించటమే పనిగా పెట్టుకుంది. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్ లబ్ధిదారుల్లో సుమారు 90 శాతం మంది అర్హులేనని అధికారులే ఒప్పుకుంటున్నారు. అయితే టీడీపీ అధినేత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని చెప్పుకునేందుకు కొందరు లబ్ధిదారులను తొలగించి.. వారికిచ్చే మొత్తాన్ని మిగిలిన వారికి పంచిపెట్టి తామూ హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పుకునేందుకు ఎత్తు వేసింది. అందులో భాగంగానే ఇటీవల టీడీపీ ప్రభుత్వం తమ్ముళ్లను కమిటీలుగా ఏర్పాటు చేసి మరీ తొలగించారు. అందులో టీడీపీకి ఓటేయని వారిని గుర్తించి మరీ తొలగించటమే కార్యక్రమంగా పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహరిస్తోందని పలువురు మండిపడుతున్నారు. అర్థాంతరంగా పించన్లు తొలగిస్తే మేమెట్టా బతకాలి? అని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇష్టారాజ్యంగా తొలగింపు ఇటీవల జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు కమిటీల పేరుతో అనేక మంది లబ్ధిదారులను అర్హుల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.58,382 పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతంలో ప్రభుత్వం రూ.6.73 కోట్లు చెల్లించేది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు గతంలో ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.1,500కు పెంచుతానని ప్రకటించారు. ఈ లెక్కన ఉన్న వారందరికీ ఇవ్వాలంటే భారమవుతుందని భావించిన చంద్రబాబు అధికారులపై నమ్మకం లేక తమ్ముళ్లతో కమిటీలు వేసి పింఛన్ల ఏరివేతకు శ్రీకారం చుట్టారు. అలా కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలు కమిటీలుగా ఏర్పడి సుమారు 50వేల మందిని తొలగించారు. మరో 5వేల మంది పింఛన్లకు అర్హులా? కాదా? అనేది ఇంకా తేల్చలేదు. ఇదిలా ఉంటే కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 30వేల మంది పరిస్థితేంటనే విషయం తేల్చలేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి చేపట్టిన జన్మభూమి-కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడుగడుగునా అడ్డుకున్నారు. నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ తొలగించారనే బెంగతో వృద్ధుడి మృతి అనుమసముద్రంపేట: టీడీపీ నాయకులు తన పింఛన్ను తొలగించారనే బెంగతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుడిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుడి బంధువుల కథనం మేరకు..పల్లాపు లక్ష్మయ్య (70)కు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలో లక్ష్మయ్య లేడనే కారణంతో ఇటీవల పింఛన్ను తొలగించినట్టు గ్రామసభలో తెలిపారు. లక్ష్మయ్య కుమార్తె, కుమారుడు జలదంకిలో ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కుమారుడి వద్దకు వెళ్లాడు. పింఛన్ల కమిటీ సమావేశం రోజు రాలేదన్న కారణంతో పింఛన్ను తొలగించారు. గుడిపాడు గ్రామంలో జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో లక్ష్మయ్యకు పింఛన్ ఇవ్వలేదు. దీంతో కలత చెంది తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు వైద్యశాలకు తరలించేలోపు మృతి చెందాడు. అధికార పార్టీ నేతలు అర్హులైన వృద్ధుల పింఛన్ల తొలగించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని పలువురు మండల నాయకులు ఆరోపిస్తున్నారు.