breaking news
APBCL
-
మద్యంపై ఎవరెంత ఖర్చుపెడితే మీకెందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని మద్యం షాపుల్లో త్వరలో డిజిటల్ రూపంలో చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నామని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) గురువారం హైకోర్టుకు నివేదించింది. దసరా నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది పి.నరసింహమూర్తి కోర్టుకు వివరించారు. బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఆన్లైన్/డిజిటల్ రూపంలో చెల్లింపులను ఆమోదించడం లేదని, అన్నిచోట్లా డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దసరా నాటికి డిజిటల్ చెల్లింపులు.. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. ఏపీబీసీఎల్ న్యాయవాది దసరా కల్లా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ స్పందిస్తూ.. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానించడం ఏమిటంటూ ప్రశ్నించింది. మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని.. వారు రోజూ రూ.200–రూ.300 వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ చెప్పారు. మద్యంపై ఎవరెంత ఖర్చు పెడుతున్నారు.. ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్కెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ నిలదీసింది. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగిచూస్తున్నారని ప్రశ్నించింది. అందరి సమాచారం అడుగుతున్నారు.. మరి పిటిషనర్ ఏం చేస్తుంటారని ప్రశ్నించింది. దీనికి ప్రవీణ్ సమాధానం చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పడానికి ఇష్టపడరు.. మిగి లిన వారి గురించి మాత్రం మీకు అన్నీ కావాలా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘ఆ ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేశాం’ ఇద్దరు వ్యక్తులను నిర్బంధించి కొట్టిన వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్ఐని సస్పెండ్ చేశామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గురువారం హైకోర్టుకు నివేదించారు. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల ఒంటిపై గాయాలున్నాయన్న వైద్యుల నివేదికను పరిశీలించాక తగిన విధంగా స్పందిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైద్యుల నివేదికను ఏజీకి అందచేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.రాజారెడ్డి చెప్పడంతో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన భర్త కంచర్ల నవీన్బాబు, అతని స్నేహితుడు అశోక్ బాబులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ గుంటూరు జిల్లా, తోకలవానిపాలెంకు చెందిన షేక్ అక్తర్ రోషన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఈ వ్యాజ్యంపై గురువారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో నవీన్బాబు, అశోక్ బాబులకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వైద్య పరీక్షల నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదకను పరిశీలించిన ధర్మాసనం ఇద్దరి ఒంటిపై గాయాలున్నట్లు తెలిపింది. పాదాలపై కొట్టడం ఇక్కడమేన్నా ఆచారంగా వస్తోందా? అంటూ వ్యాఖ్యానించింది. అలాంటిది ఏమీ లేదని ఏజీ చెప్పారు. ‘ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో సరికాదు’ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన జడా రవీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి ఫొటో ముద్రణపై ఉన్న అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిటిషనర్ను ఆదేశించింది. ఆ అభ్యంతరాలపై అధికారులు ఆరు వారాల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ముందుకు అధికారులు కోర్టు ధిక్కార కేసులో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుకు చెందిన ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ పాఠశాలల యజమాన్యాల సంఘంతోపాటు మరికొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో బి.రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, మరికొందరు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం కోర్టు ముందు హాజరయ్యారు. ఆత్మహత్యలొద్దు.. న్యాయం చేస్తాం: కాంట్రాక్టర్లకు హైకోర్టు విజ్ఞప్తి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవద్దని కాంట్రాక్టర్లకు హైకోర్టు గురువారం విజ్ఞప్తి చేసింది. అసహనం, ఆగ్రహం, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని హితవు పలికింది. కొంత ఆలస్యమైనా న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపింది. అధికారుల చర్యల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికే న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాలపై ఆయన కొద్ది వారాలుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలపై ఆయన మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. బిల్లులు అందక అనంతపురం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. -
అమరావతిలో హైకోర్టు తొలి తీర్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మద్యం గోడౌన్లలో 40 శాతం మంది హమాలీలను కొత్త గోడౌన్లలో పనిచేసేందుకు అనుమతించాలంటూ హమాలీల సంఘం దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం. ఇదీ నేపథ్యం విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్ మద్యం గోడౌన్ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్ను ఏపీబీసీఎల్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్లో పనిచేస్తున్న హమాలీల్లో 40 శాతం మందిని నిడమానూరు గోడౌన్లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ హమాలీల సంఘం ఏపీబీసీఎల్కు వినతిపత్రం సమర్పించింది. అధికారులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ యూనియన్ అధ్యక్షుడు ఎ.సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై సతీష్ దాఖలు చేసిన అప్పీల్ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గోడౌన్లో 40 శాతం మంది హమాలీలు పనిచేసేందుకు అనుమతిస్తూ గతంలో సర్కులర్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్కుమార్ తెలిపారు. అయితే ఈ సర్కులర్ను కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చామని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది నివేదించారు. స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి శాంతిభద్రతల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యూనియన్ తరఫున సతీష్ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. -
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
కాకినాడ క్రైం :మద్యం షాపుల లెసైన్సులకు గడువు ముగుస్తుండడంతో జిల్లాలో మద్యం సిండికేట్ బరి తెగిస్తోంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. నూతన మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం టెండరు విధానానికి స్వస్తి పలుకుతూ జనాభా ప్రకారం ధర నిర్ణయించి నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గతేడాది జిల్లాలో 555 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా వంద దుకాణాల నిర్వహణకు వ్యాపారులెవ్వరూ ముందుకు రాలేదు. ఏడాది క్రితం రెన్యూవల్ నిమిత్తం కూడా సుమారు 50 మంది యజమానులు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 400 షాపుల మాత్రమే లెసైన్సు పొంది ఉన్నాయి. తిరిగి చెల్లించని ఒప్పందంతో దరఖాస్తు రుసుం రూ.25 వేలు నిర్ణయించడంతో దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 1.12 కోట్లు సమకూరింది. మిగిలిన దుకాణాలను ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్వహించాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే జిల్లాలో కాకినాడ, రాజమండ్రి తప్ప ఇంకెక్కడా అవుట్లెట్లు ఏర్పాటు చేయలేకపోయారు. పాత విధానాలే అమలు కోటాకు మించి మద్యం తీసుకోవాలంటే అదనపు మద్యం అమ్మకాలపై ప్రివిలేజ్ ఫీజుగా 14 శాతం సుంకం చెల్లించాలి. దీంతో తమకు ఏమీ మిగలదని వ్యాపారులు అధిక మద్యం తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి సైతం పాత మద్యం విధానాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రివిలేజ్ ఫీజును 13.6 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త పాలసీ వస్తుందని ఎదురుచూసిన మద్యం వ్యాపారులకు నిరాశే మిగిలింది. ఈ నెలాఖరులోగా కొత్తగా దరఖాస్తులు స్వీకరించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కాగా ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్ రావత్ శనివారం 13 జిల్లాలో డిప్యూటీ కమిషనర్లతో సమీక్షించి విధివిధానాలు ఖరారు చేశారు. జిల్లాలో సుమారు 1,100 గ్రామాలుండగా 4,500 పైగా బెల్టుషాపులు ఉన్నట్లు అంచనా. మద్యం దుకాణాల్లో ఉదయం 10.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ద్వారానే 60 శాతం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం. మందుబాబుల అలవాటును మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 20 పైబడి అధికంగా ధర చెల్లించాల్సిందేనని మందుబాబులు చెబుతున్నారు. చాలా బడ్డీ కొట్లు, కిళ్లీషాపుల వద్ద బెల్టుషాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఒక్కో షాపులో రోజూ దాదాపు 200 వరకు బీర్లు అమ్ముడవుతాయి. విస్కీ, రమ్ము, జిన్ను, బ్రాందీ, వైన్ కూడా సుమారు 400 బాటిళ్లు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో బీర్లు అధికంగా అమ్ముడుపోతున్నాయి. చర్యలు తీసుకుంటాం మద్యం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై అధికారులను అప్రమత్తం చేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న మద్యం వ్యాపారుల ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -సీహెచ్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్