breaking news
anti defection
-
ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం అతి ప్రమాదకరం
దేశం ఎన్నికల కొలిమి నుండి ఎండల కొలిమిలోకి నడుస్తోంది. ఈ వేడిలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో విసురుతున్న సవాళ్లల్లో కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోతున్నాము. అటువంటి వాటిలో ఒకటి పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ఉండాల్సిన సంబంధం. మోదీ అధికారానికి రావటానికి ముందే ఈ దేశాన్ని కాంగ్రెస్ చెర నుండి విముక్తి చేయటం లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అధికారానికి వచ్చాక దేశాన్ని ప్రతిపక్షం నుండి విముక్తి చేయటమే లక్ష్యమని సవరించుకున్నారు. మరోవైపున ఆర్నెల్ల క్రితం ఎన్నికలు జరిగిన తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లో చేరనున్నట్లు, కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయనున్నట్లు వార్తలు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ జెండా కింద గెలిచిన దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పచ్చ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకున్నారు. కొద్దికాలం క్రితం జమ్ముకాశ్మీర్లో బీజేపీ, పీడీపీల పొత్తు వికటించిన తర్వాత పీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. చివరకు పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్లు జతకట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని గవర్నర్ను కోరటంతో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్షాన్ని కబళించటం పాలకపక్షం హక్కయింది. ఈ నేపథ్యంలో కొన్ని మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షం ప్రజాస్వామ్య మౌలిక లక్షణాల్లో ఒకటి. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే శక్తి. ప్రభుత్వ తప్పొప్పులను పరిశీలించి జవాబుదారీతనం కోరే శక్తి. ఐదేళ్లకొకసారి ప్రజల ముందుకొచ్చే ఎన్నికల్లో ఏదో ఒక మోతాదులో ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకుతెచ్చే అవకాశం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయం ప్రతిపాదించటం అంటే పాలకపక్ష వైఫల్యాలను ముందు పరిశీలించాలి. విమర్శించాలి. ప్రజలకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి అర్థం చేసుకుని నివారణ అవకాశాలను ప్రజల ముందుంచాలి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను, దొర్లిన పొరపాట్లను గుర్తించి ప్రజల ముందు ఎత్తి చూపాలి. బహుశా ప్రతిపక్షం ఉంటే తమ వైఫల్యాలు, చేతగానితనం బండారం ఒకరోజు కాకపోతే మరో రోజైనా బట్టబయలు కాక తప్పదన్న సూత్రాన్ని పాలక పార్టీలు అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి. అందుకే అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లున్నాయి. ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం గురించి చర్చించాలనుకున్నపుడు పురాణాల్లో ప్రతిపక్షం పాత్ర, ప్రతిపక్షం లేకపోవటం వల్ల కలిగిన నష్టాలను గుర్తు చేసుకోవటం అవసరం అనిపిస్తోంది. రామాయణంలో దశరధుడు రాముడిని వనవాసం పంపాలని నిర్ణయించినప్పుడు ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు ఎవ్వరూ వేయలేదు. సీతను అడవిలో విడిచి రమ్మని రాముడు ఆదేశించినప్పుడు ఇది నైతికమా, చట్టబద్ధమా, న్యాయసమ్మతమా అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. రావణుడు సీతను అపహరించుకు వచ్చినప్పుడు మండోదరి మనకు ఇది తగదు అని చెప్పిందే తప్ప ప్రతిఘటించలేదు. రాముడితో కయ్యానికి కాలు దువ్వటం తగదు అని కనీసం విభీషణుడు ఎదురు తిరిగాడు. రావణుడు కాదు కూడదు అన్నప్పుడు లంక నుండి వాకౌట్ చేశాడు. ఇది ప్రతిపక్షం. ఇదే ప్రతిపక్షానికి తగిన బలం ఉంటే రామ రావణ యుద్ధం జరిగి ఉండేదే కాదు. ఇవి మినహా రామరాజ్యంలో ప్రతిపక్షానికి తావు లేదు. లంకలోని రావణ రాజ్యంలోనే ప్రతిపక్షానికి చోటు ఉంది. ఈ ప్రతిపక్షం మాట కూడా విననప్పుడు లంక రావణ కాష్ఠమైంది. మహాభారతంలో పాచికలాటలో ద్రౌపదిని పణంగా పెట్టేటప్పుడు కొలువులో ఉన్న పెద్దలందరూ ముఖముఖాలు చూసుకున్నారే తప్ప ఎవ్వరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. మహాభారతంలో పాలకుల నిర్ణయాలను ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని నాటి సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు నిలదీసి అడ్డుకుని ఉంటే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. కౌరవసేనలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి తర్వాత పెద్దవాడు వికర్ణుడు. వస్త్రాపహరణ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వికర్ణుడు కూడా వాకౌట్ చేస్తాడు. కనీసం వికర్ణుడు పోషించిన ప్రతిపక్ష పాత్రను కురువృద్ధులు, గురువృద్ధులు పోషించి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. మహా భారత, రామాయణాలే ప్రతిపక్షం పాత్ర గురించి హెచ్చరిస్తున్నాయి. నాటి కథలన్నీ రాచరికమూ, నియంతృత్వమే. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మరెన్ని ఉత్పాతాలకు దారి తీయనున్నాయో ఆలోచించుకోవటం ఓటర్ల వంతు. -కొండూరి వీరయ్య వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత -
సీఎం సంతబేరం
* విపక్ష ఎమ్మెల్యేలపై ప్రలోభాల వల * రెండు మాసాలుగా విస్తృత కసరత్తు * చివరకు 4 వికెట్లతో సరి * రెండు మంత్రి పదవులు.. ఒకరికి కేసుల్లో, ‘ఇతరత్రా’ సాయం * టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ఖాన్, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి * కర్నూలు, కడప టీడీపీ వర్గాల్లో భగ్గుమన్న అసంతృప్తి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ప్రలోభాలు కొద్దిగా ఫలించాయి.. ఎడతెగని ఒత్తిళ్లు కొద్దిమేర పనిచేశాయి.. గత కొన్ని నెలలుగా అనేక మాయోపాయాలతో అధికార పార్టీ అవిశ్రాంతంగా జరిపిన ప్రయత్నాలు స్వల్పంగా నెరవేరాయి. మంత్రిపదవులు.. డబ్బు.. కాంట్రాక్టులు.. లెసైన్సులు.. కేసుల ఎత్తివేత వంటి ఎన్నో గుక్కతిప్పుకోనివ్వని ఆఫర్లతో అధికారపక్షం రెండునెలలుగా విస్తృత కసరత్తుచేసినా చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తలొగ్గారు. ఎన్ని ప్రలోభాలు కనిపిస్తున్నా తట్టుకుని నిలిచిన మిగిలిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాలలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు చేరిన ఆనందం అధికారపార్టీలో కొద్దిసేపు కూడా నిలవలేదు. కర్నూలు, కడప దేశం వర్గాలలో అసంతృప్తి భగ్గుమంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నలుగురు ఎమ్మెల్యేలను సామదానభేద దండోపాయాలతో లొంగదీసుకోగలిగారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సోమవారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబునాయుడు వారికి పచ్చ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విలువలకు నీళ్లొదిలి ఎమ్మెల్యేలను ఆఫర్లతో ఆకర్షించడం, పార్టీ ఫిరాయించేలా నిస్సిగ్గుగా ప్రోత్సహించడం రాష్ర్టవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపరిచే పనిలో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. కోట్ల రూపాయలను కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. వైఎస్సార్కాంగ్రెస్ పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకొచ్చారు. అనేక ఇతర ఆఫర్లతో పాటు భూమానాగిరెడ్డి, జలీల్ ఖాన్లకు మంత్రిపదవులిచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వియ్యంకుడైన విద్యాసంస్థల యజమాని ఎదుర్కొంటున్న కేసుల విషయంలో సాయపడతామని హామీ ఇవ్వడంతో పాటు భారీగా నగదు, కాంట్రాక్టులిచ్చేందుకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ. 25 కోట్ల డబ్బు, భారీఎత్తున కాంట్రాక్టులు ఇచ్చేందుకు కూడా తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది. తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు... ప్రలోభాలు... హామీలు అమలు చేయకపోవడం, తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత పెల్లుబుకడంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసం గత కొద్ది కాలంగా అధికారపార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీయడాన్ని పనిగా పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. 22నెలలుగా విచ్చలవిడిగా అవినీతి కుంభకోణాలతో ఆర్జించిన డబ్బును వెదజల్లి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అందులోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా మాట్లాడుతూ హామీలిస్తూ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో ముందు ‘చినబాబు’ తర్వాత ‘పెదబాబు’ మాట్లాడుతున్నారని తెలుగుదేశం వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పొరుగు రాష్టంలో పార్టీకి చాపచుట్టే దుస్థితి దాపురించడం, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తకు కుమారుడు లోకేష్ ‘రాజకీయ పనితనం’ తేటతెల్లం కావడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగి దిక్కుతోచని స్థితిలోనే ఏపీలో పార్టీ ఫిరాయింపులను నిస్సిగ్గుతో ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఫిరాయించడమంటే కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడమేనని సత్యవాక్కులు వల్లించిన బాబు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎలా ఆకర్షిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, అక్రమాలతో పీకల్లోతు కూరుకుపోయి మసకబారిన పరువు ప్రతిష్టలను, భ్రష్టు బట్టి పాతాళంలోకి దిగజారిపోతున్న పార్టీని ఎలాగైనా బతికి బట్టకట్టించుకునేందుకు బాబు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా కులాలు, మతాలు, ప్రాంతాల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు రకరకాల ఆఫర్లను ఎరవేసి ఫిరాయింపులకు ద్వారాలు తెరిచారు. అవినీతి సంపాదనతో లక్షల కోట్లను కూడబెట్టిన ఆయన కోట్ల రూపాయలను ప్రతిపక్ష నేతలకు వెదజల్లడానికి కోటరీ ద్వారా కుయుక్తులు కొనసాగిస్తున్నారని వినిపిస్తోంది. ‘ఆకర్ష్’కు లొంగింది నలుగురే.. హామీలను అమలుచేయని టీడీపీ సర్కారుకు కాలం చెల్లడం ఖాయమన్న విమర్శలు పెరుగుతుండడంతో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను కేంద్ర మంత్రి నేతృత్వంలో అయిదుగురితో కమిటీని నియమించి వారి ద్వారా నిత్యం రాయబేరాలు కొనసాగిస్తూ వచ్చారు. కులాలపరంగా, మతపరంగా, ప్రాంతాలవారీగా ఎవరినైనా విడగొట్టడంలో, వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రబాబు, ఆయన కోటరీలోని కీలకనేతలు గత కొద్దికాలంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎవరెన్ని ప్రలోభాలకు విశ్వప్రయత్నాలు చేసినా నలుగురు మినహా వైఎస్సార్కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. తాము ప్రలోభాలకు లొంగే రకం కాదని నిరూపించుకున్నారు. మంత్రి పదవులు, నగదు, కాంట్రాక్టులు ఇస్తామని ఎన్నెన్ని ఆశలు చూపినా... కేసులు పెడతామని, వ్యాపారాలను దెబ్బతీస్తామని తీవ్ర హెచ్చరికలు పంపినా లెక్కచేయని నేతలుగా నిలిచారు. చివరకు రాజధానిలో రూ.కోట్లు విలువచేసే భూములు ఇస్తామని, వ్యాపారాలకు వీలు కల్పిస్తామని ఊరిస్తున్నా మీ పప్పులేమీ తమ వద్ద ఉడకవని తేల్చి చెప్పారనేది సమాచారం. రామసుబ్బారెడ్డి కుటుంబం అసంతృప్తి జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశంపై మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మల ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం కరవైందని టీడీపీ నాయకులంటున్నారు. ‘‘మేం పార్టీనే నమ్ముకున్నాం. కుటుంబ సభ్యుల ప్రాణాలను పోగొట్టుకున్నాం. ఎందరో కార్యకర్తల కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. అవిటివాళ్లు అయిన వారున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి ఇందుకు కారకులు దేవగుడి కుటుంబం అన్నది అందరికీ తెలుసు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడంకన్నా దారుణం మరొకటి ఉంటుందా. ఇదేనా మీరు మాకు ఇచ్చే ప్రాధాన్యం’’ అని రామసుబ్బారెడ్డి కుటుంబం ప్రశ్నలకు బాబుకు నోట మాట రాలేదనేది విశ్వసనీయ సమాచారం. ఎంతోకాలంగాక మీకు ఇదే చెబుతూ వస్తున్నాం. ఇక మీ ఇష్టం అని అయిష్టంగానే రామసుబ్బారెడ్డి కుటుంబీకులు బాబు వద్ద నుంచి వచ్చేశారని తెలిసింది. విజయవాడలో రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. టీడీపీ గురించి, చంద్రబాబు గురించి భూమా నాగిరెడ్డి కుటుంబం ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో గుర్తు చేసుకోవాలని కర్నూలుజిల్లా టీడీపీ నాయకులంటున్నారు. శిల్పా సోదరులు ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారని వినిపిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్కు మంత్రి పదవి ఆశచూపడం ఇప్పటిది కాదు. ఎన్నికలు అయిన నాటి నుంచి చర్చలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తాము ఏమైపోయినా ఫర్వాలేదనుకునేలా పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షపార్టీ నుంచి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను పట్టించుకోవడంలేదని టీడీపీ ముఖ్య నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. స్థానికంగా, క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ప్రతిపక్షంగా వ్యవహరించిన వారితో ఇప్పటికిప్పుడు కలిసి పనిచేయడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. -
'పార్టీ మారిన వారిపై చర్యలు ఇంకెప్పుడు'
హైదరాబాద్: పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఛాంబర్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం బైఠాయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మధుసూదనాచారి వారితో చెప్పారు.ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కచ్చితంగా తేదీ చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.