breaking news
andhra pradesh revenue department
-
AP: తగ్గిన రాష్ట్ర ఆదాయం
సాక్షి, అమరావతి: గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే 2019–20, 2020–21 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయమూ తగ్గిపోయిందని వెల్లడించింది. కోవిడ్–19 ప్రభావం, లాక్ డౌన్, ఆంక్షల కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–20లో రూ.4,545 కోట్లు తగ్గింది. 2020–21లో ఏకంగా రూ. 8,326 కోట్లు తగ్గింది. రాష్ట్ర వస్తు సేవల పన్నుతో పాటు అమ్మకం పన్ను, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడాఆ రెండేళ్లలో తగ్గిపోయినట్లు తెలిపింది. బాగా పెరిగిన తప్పనిసరి వ్యయం రాష్ట్ర ప్రభుత్వ తప్పనిసరి వ్యయం బాగా పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ప్రధానంగా వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లు భారీగా పెరిగినట్లు తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో వడ్డీ చెల్లింపుల వ్యయం ఏకంగా 13 శాతం పెరిగిందని కాగ్ పేర్కొంది. గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నట్లు తెలిపింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో ఏకంగా 13 శాతం పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వడం, కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో వేతనాల వ్యయం భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ల వ్యయం కూడా 2019–20తో పోలిస్తే 2020–21లో 0.48 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. -
అసైన్డ్ భూముల అమ్మకానికి పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన అసైన్డ్ భూములను నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ) లేకుండా అమ్ముకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్ట అయితే 5 ఎకరాలు, తరి భూమి అయితే రెండున్నర ఎకరాలను ప్రభుత్వం వీరికి ఉచితంగా కేటాయిస్తోంది. భూమి పొందిన వారు పదేళ్లు అ నుభవించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. రూ.కోటి లోపు విలువైన భూమి విక్రయానికి జిల్లా కలెక్టర్, రూ.2 కోట్ల లోపు విలువైన భూవిక్రయానికి రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఎన్ఓసీని ఇవ్వవచ్చు. రూ.2 కోట్లకుపైగా విలువైన భూమి విక్రయానికి ఎన్ఓసీని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు ఇప్పటికే ఎన్ఓసీలు లేకుం డానే సబ్ రిజిస్ట్రార్లను మేనేజ్ చేసి భూములను అమ్మేశారు. భూములు అమ్మేసిన వారి వారసులు ఇప్పుడు తమ భూములను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొనుగోలు చేసిన వారు నష్టపోతారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగర సరిహద్దు ల్లో పూర్వం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు తీసుకున్న అసైన్డ్ భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్ఓసీలు లేకుండా కొనుగోలు చేసిన వారు ఇబ్బం దులు తప్పవని భయపడుతున్నారు. అందువల్ల ఎన్ఓసీలు లేకుండా కొనుగోలు చేసినా చెల్లుబాటయ్యేలా జీవో ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఎన్ఓసీ లేకుండా అమ్ముకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి పంపింది.