breaking news
Amrit Sarovar Programme
-
అమృత్ సరోవరం
కడప సిటీ : ఉపాధి హామీ పథకంలో చెరువుల అభివృద్ధి పనుల వల్ల రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమృత్ సరోవర్ పేరిట ప్రతి జిల్లాలో 75 చెరువులు పూర్తి చేయాలన్నది సంకల్పం. ఇవన్నీ మార్చి 2023 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. కనీసం ఆగస్టు 15వ తేదీలోపు 20 చెరువుల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా చెరువుకట్ట భద్రం చేయడం, కంప తొలగించడం, పూడికతీతీ పనులు చేపట్టాల్సి ఉంటుంది. చెరువుకట్టకు అవసరమైన మట్టి వేసిన తర్వాత మిగతా మట్టిని రైతులు ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకుంటే ఉపాధి హామీ కూలీలే ఉచితంగా లోడింగ్ చేస్తారు. అంతేకాకుండా చెరువుల పరిసరాల్లో ఉన్న ఆయకట్టుకు నీరందుతుంది. దీంతో భూగర్బ జలాలు సమృద్ధిగా ఉంటాయి. చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. ఆగస్టు 15న కనీసం 23 చెరువులు పూర్తి చేసి ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో సర్పంచుతో కలిసి అధికారులు జాతీయ జెండాను చెరువుల వద్ద ఎగుర వేయాలన్నది నిర్ణయం. ‘ఉపాధి’లో 113 చెరువుల అభివృద్ది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 113 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అనుమతులు కూడా రావడంతో మే నెల చివరిలో బి.మఠం మల్లేపల్లెలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కలెక్టర్, జేసీలు, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అధికారులతోకలిసి ఇందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. ఆరోజు నుంచి జిల్లాలో పనులు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా... ఈ పథకం కింద నియోజకవర్గాల వారీగా చెరువుల అభివృద్ధి పనులను పరిశీలిస్తే బద్వేలు నియోజకవర్గంలో 23, జమ్మలమడుగు 9, కమలాపురం 25, పులివెందుల 13, రాజంపేట 9, మైదుకూరు నియోజకవర్గంలో 13 చెరువులను బాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి కాకుండా అటవీశాఖ పరిధిలో మరో 17 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. కూలీలు ఎంతమంది? పనులను కేవలం యంత్రాలతో కాకుండా కూలీలతోనే చేయాల్సి ఉంది. ఎవరికి కాంట్రాక్టు పనులు ఇచ్చేది ఉండదు. ఇందుకుగాను 3.18 లక్షల పనిదినాలు (కూలీలు) అవసరమవుతాయి. కూలీల వేతనాలకుగాను రూ. 8.18 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా చెరువుకట్ట భద్రం చేయడం, కంపచెట్లు తొలగించడం, పూడికతీత పనులు చేపడతారు. రైతులకు మరిన్ని ప్రయోజనాలు చెరువుల అభివృద్ధి వల్ల రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. చెరువుల చుట్టుప్రక్కల దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. అంతేకాకుండా కూలీలు తీసిన మట్టిని రైతు ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకుంటే ఉచితంగానే పొలాలకు తరలించే అవకాశం ఉంటుంది. అయితే గ్రామసభలో నిర్ణయించిన మేరకు రైతులకు ప్రాధాన్యత ఉంటుంది. బృహత్తర పథకం ఆజాదీ కా అమృత్ సరోవర్ అనే పథకం బృహత్తరమైంది. దీని వల్ల జిల్లాలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చింది. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల పనులు ప్రారంభించాం. రైతులు కూలీలు తీసిన మట్టిని పొలాలకు ఉచితంగా తరలించుకునేందుకు అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. నిర్ణయించిన గడువులోగా చెరువుల అభివృద్ధిని ప్రణాళిక మేరకు పూర్తి చేస్తాం. – పి.యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
‘అమృత్ సరోవర్’లో ఏపీకి మూడో స్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి ఎగబాకింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 24న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్ మీటర్ల మేర నీరు నిల్వ చేసేలా ఈ చెరువులు నిర్మించాలని నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యం కన్నా ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 2,890 చెరువుల నిర్మాణం, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,809 చెరువుల పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టుకు చెరువుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 399 చెరువుల నిర్మాణం పూర్తి చేస్తామని పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్, శాంతిప్రియ పాండే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బుధవారం నాటికే 181 పూర్తి చేసి మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. మన కంటే ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి. ఈ కార్యక్రమం అమలు మొదలైన తొలి రోజుల్లో మన రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉండగా, తాజాగా మూడోస్థానానికి ఎగబాకింది. అమృత్ సరోవర్ కార్యక్రమంలో చెరువుల పూర్తికి గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ ఆధ్వర్యంలో ప్రతి వారం ఈ అంశంపై కూడా శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. కాగా, నిర్మాణం పూర్తయిన చెరువుల వద్ద ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.