breaking news
Airbus A-380
-
ఎ-380.. ఇక టేకాఫ్
ఎయిర్బస్ జంబో విమానాలకు మంత్రుల బృందం గ్రీన్సిగ్నల్... హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి రాకపోకలు న్యూఢిల్లీ: ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే కన్పించే అత్యంత సౌఖ్యవంతమైన ఎ-380 సూపర్ జంబో విమానాలు ఇకనుంచి భారతీయులకు కనువిందు చేయనున్నాయి. ఐదేళ్లుగా వీటి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని భారత ప్రభుత్వం సోమవారం తొల గించింది. ఈ విమానాలను అనుమతించాలంటూ సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కొన్నేళ్లుగా భారత్ను కోరుతున్నాయి. అతి పెద్ద బాడీతో, సుదూర ప్రయాణాలు చేయగల ఎ-380లను అనుమతిస్తే దేశీయ విమాన కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలగవచ్చని కేంద్రం గతంలో భావించింది. డీజీసీఏ, ఎయిర్ ఇండియా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య కొన్ని వారాలుగా చర్చలు సాగిన నేపథ్యంలో... ఈ విమానాలపై ఆంక్షలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి రాకపోకలకు తగిన మౌలిక సౌకర్యాలున్న హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో మాత్రమే వీటిని అనుమతిస్తారు. ఈ నాలుగు విమానాశ్రయాలూ డీజీసీఏ సర్టిఫికేషన్ పొంది, సేవలకు తగిన సన్నాహకాలు పూర్తిచేయాల్సి ఉంది. ఆంక్షల ఎత్తివేత ప్రకటన వెలువడగానే ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్తో పాటు ఏ-380లను తయారు చేసే ఎయిర్బస్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఎ-380 విమానాలతో చార్జీలు తగ్గుతాయని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎం జీ ఏరోస్పేస్ హెడ్ అంబర్ దూబే అభిప్రాయపడ్డారు. గతంలోనూ వచ్చిన ఎ-380 విమానాలు ఈ విమానాన్ని గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ఎయిర్షోలో ప్రదర్శించారు. ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టులకూ వెళ్లాయి. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఎ-380 విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్లో ల్యాండ్ చేశారు కూడా. ఎయిర్ ఇండియాకు సమస్యలు? ఎయిర్ ఇండియా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీ ఎయిర్పోర్టులోకి ఎ-380 విమానాలను అనుమతించాలన్న నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఆధునిక బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల ద్వారా వివిధ దేశాలకు సర్వీసును నిర్వహించాలనుకుంటున్న ఎయిర్ ఇండియాకు తాజా నిర్ణయం తో సమస్యలు ఏర్పడవచ్చని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏ-380 ప్రత్యేకతలు ఇవీ.. ఈ డబుల్ డెకర్ విమానంలో ఎకానమీ క్లాస్ మాత్రమే ఉంటే 850 సీట్లుంటాయి. మూడు తరగతులు (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్) ఉంటే 550-600 మంది ప్రయాణించొచ్చు. ఈ తరహా విమానాలున్న 10 అంతర్జాతీయ ఎయిర్లైన్స్లో 9 సంస్థలు భారత్కు విమానాలు నడుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110కు పైగా ఎ-380 విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఇవి ఇంధనాన్ని అతి తక్కువగా వినియోగించుకుంటాయనీ, ఒకో సీటు నిర్వహణ వ్యయం అతి తక్కువని ఎయిర్బస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రావు చెప్పారు. -
ఇక మనకూ ఎయిర్బస్ ఎ-380లు!!
ఎయిర్బస్ ఎ-380.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. ఇది వస్తోందంటేనే పెద్ద రాజసం కనపడుతుంది. ఎన్నాళ్లనుంచో ఈ తరహా విమానాలను మన దేశంలోకి అనుమతించాలని పలు విమానయాన సంస్థలు కోరతుండటంతో.. ఇప్పటికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వాటికి పచ్చజెండా ఊపింది. దేశంలో ఇంత పెద్ద విమానాలను ఆపరేట్ చేయగల నాలుగు విమానాశ్రయాలలోకి మాత్రమే వీటిని అనుమతిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయి డబుల్ డెక్కర్ విమానాలైన వీటిపై ఉన్న నియంత్రణను ఎయిరిండియా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, డీజీసీఏతో చర్చించిన అనంతరం ఎత్తేశారు. ఈ విమానంలో అంతా ఎకానమీ క్లాస్ అయితే ఒకేసారి మొత్తం 850 మంది ప్రయాణం చేయొచ్చు. అదే మూడు తరగతులు ఉండాలంటే మాత్రం 550-600 మంది వరకు పడతారు. సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా సంస్థలు ఎప్పటినుంచో ఈ విమానాలు తెస్తామని అంటున్నాయి. మన దేశంలో విమానాలు నడిపిస్తున్న మొత్తం 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలో తొమ్మిదింటి వద్ద ఈ భారీ విమానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 ఎ-380లు ప్రస్తుతం ఎగురుతున్నాయి.