breaking news
With advanced technology
-
సర్కారు వైఫల్యాలపై ఆన్లైన్ యుద్ధం
బెంగళూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్రశాఖ కోర్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలలుగా రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొంటున్న ఐఏఎస్ అధికారులను తరుచూ బదిలీలు చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం 135 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కరువు నివారణ పనులు సాగడం లేదు. దీంతో తాగునీటితో పాటు పశువుల మేతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర హోంశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విపక్ష భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అందులో భాగంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఎస్.ఎం.ఎస్ల ద్వారా ప్రభుత్వలోపాలను ప్రజలకు తెలియజెప్పాడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి., గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ప్రస్తుతం ఆ రంగంలో ఏర్పడిన తిరోగమనం... ఇలా ప్రతి విశయాన్ని గణాంకాల రూపంలో బల్క్ ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపించాలని నిర్ణయించింది. ఇక ఫేస్బుక్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న శాంతిభద్రతల సమస్యలు, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉంచాలని కమలనాథులు నిర్ణయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు ముగిసిన తర్వాత ఈ నూతన ఘట్టానికి తెరలేపనున్నట్లు బీజేపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. -
ఆదాయానికి అనువైన మార్గం.. అనువాదం!
అప్కమింగ్ కెరీర్ ఒక భాషలో ఉన్న ప్రాచీన సాహిత్యాన్ని, విలువైన గ్రంథాలను చదవాలంటే ఆ భాషను స్వయంగా నేర్చుకోవాల్సిన పనిలేదు. మాతృభాషలోకి తర్జుమా చేసిన పుస్తకాలను చదివితే సరిపోతుంది. అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనువాదకులకు(ట్రాన్స్లేటర్స్) డిమాండ్ నానాటికీ విస్తృతమవుతోంది. దీన్ని కెరీర్గా ఎంచుకున్నవారికి దేశవిదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ట్రాన్స్లేషన్ కోర్సుల్లో చేరే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. అవకాశాలు.. పుష్కలం ప్రపంచీకరణతో అన్నిదేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కార్పొరేట్, బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో అడుగుపెడుతున్నాయి. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు స్థానిక భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. రవాణా, పర్యాటక రంగాల్లో అనువాదకులకు భారీ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్, రిలీజియన్ వంటి వాటిలో అవకాశాలకు కొదవే లేదు. విదేశీ భాషలను నేర్చుకొనేవారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాన్స్లేటర్లకు ఫారిన్ లాంగ్వేజ్ టీచర్లుగా ఉపాధి లభిస్తోంది. బోధన, శిక్షణపై ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా స్థిరపడేందుకు వీలుంది. ట్రాన్స్లేషన్ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సులువుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంగ్లంతోపాటు జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఆయా భాషలను నేర్చుకున్నవారికి ఎన్నో రంగాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అనువాదాన్ని కెరీర్గా మార్చుకున్నవారికి ఉద్యోగాలు, ఉపాధి పరంగా ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కావాల్సిన లక్షణాలు: అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్లేషన్లో అవి ప్రతిఫలించాలి. అర్హతలు: మనదేశంలో పలు విద్యాసంస్థలు ట్రాన్స్లేషన్ స్టడీస్లో సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దూర విద్యా విధానంలోనూ కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్లో చేరొచ్చు. ఇందులో ఉన్నత విద్యనభ్యసించినవారికి మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: అనువాదకులకు అనుభవం, పనితీరును బట్టి వేతనాలు లభిస్తాయి. ఇంటర్ప్రిటేటర్స్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ. 50 వేలకుపైగానే పొందొచ్చు. ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్లకు డాక్యుమెంట్ ఆధారంగా ఆదాయం ఉంటుంది. ఫుల్టైమ్ ట్రాన్స్లేటర్లు ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు పైగా అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in ద్రవిడియన్ యూనివర్సిటీ. వెబ్సైట్: www.dravidianuniversity.ac.in ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్. వెబ్సైట్: www.ntm.org.in యూనివర్సిటీ ఆఫ్ లక్నో. వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ పుణె. వెబ్సైట్: www.unipune.ac.in అన్ని భాషల్లో అవకాశాలు ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ భాషల అనువాద నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం సాహిత్య రంగంలో పుస్తకాల అనువాదానికే పరిమితం కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ వీరి అవసరం పెరుగుతోంది. ఇంటర్ప్రిటేటర్స్గా కూడా పనిచేయొచ్చు. ఒక వ్యక్తి సంభాషణను అప్పటికప్పుడు అనువాదం చే సేవారే ఇంటర్ప్రిటేటర్స్. వీరికి అంతర్జాతీయ స్థాయిలోనూ అవకాశాలున్నాయి. దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్లేటర్స అవసరం ఉంటుంది. ప్రధానంగా ఇంగ్లిష్తోపాటు యూరోపియన్ భాషలు నేర్చుకున్న వారికి అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషల నుంచి తొలుత ఇంగ్లిష్లోకి తర్జుమా చేస్తుండడమే దీనికి కారణం. తర్వాతే ఇంగ్లిష్ నుంచి మాతృభాషల్లోకి అనువదిస్తున్నారు’’ - డా. కె. వెంకట్రెడ్డి, రిజిస్ట్రార్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ, హైదరాబాద్