30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే!.. బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక బిల్లును తీసుకురానుంది. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ కొత్త చట్టం ప్రకారం.. ఏదైనా తీవ్రమైన క్రిమినల్ లేదా అవినీతి కేసులో అరెస్టయి, వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉంటే సదరు ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతారు.రాజకీయాల్లో అవినీతిని అరికట్టేందుకు తెస్తున్న ఈ చట్టం.. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఈ సమావేశాల ప్రారంభంలోనే తన నివేదికను సభకు సమర్పించనుంది. జేపీసీ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ బిల్లును ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో, ఇది చట్టంగా మారాలంటే పార్లమెంట్లోని ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం అవుతుందిపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభమై ఆగస్టు 21 వరకు జరగనున్నాయి.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కారణంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సభకు సెలవు ఉంటుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే చర్చకు రానున్నాయి.