ఒడిసా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో ఓ మధ్యవయసు మహిళను (35) తుపాకితో బెదిరించి అత్యాచారం చేశారు.
ఒడిసా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లో ఓ మధ్యవయసు మహిళను (35) తుపాకితో బెదిరించి అత్యాచారం చేశారు. ఆమె భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నగరంలోని సమంత్రాపూర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆమె ఒంటరిగా ఉండగా ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. బుధవారం రాత్రి ఈ సంఘటనపై ఆమె మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది. నిందితుడు తన ఇంటి పొరుగు వ్యక్తేనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడిని ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్టుచేస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఇళ్లలో పనిచేసుకుని పొట్టపోసుకునే తాను.. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా పడుకున్నానని, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఎవరో తలుపు తట్టారని తెలిపింది. తలుపు తెరిచేసరికి నిందితుడు తన నోరు మూసి.. రివాల్వర్ను తన నుదిటిపై పెట్టి బెదిరించాడని ఆమె మీడియాకు తెలిపింది. తర్వాత తనపై అత్యాచారం చేసి పారిపోయినట్లు చెప్పింది. అతడు తనను చాలాకాలంగా వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. ఆమె నుంచి ఫిర్యాదు రాగానే నిందితుని ఇంట్లో పోలీసులు సోదా చేశారు. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడికోసం ఓ బృందాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు.