
ఎన్డీఏదే ముందంజ!
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారంలో వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, యూపీఏకు భంగపాటు తప్పదని సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో వెల్లడైంది.
లోక్సభ ఎన్నికల్లో యూపీఏకు భంగపాటు
సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో వెల్లడి
ఎన్డీఏకు 211-231 స్థానాలు...
యూపీఏకు 107-127 స్థానాలు!
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారంలో వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, యూపీఏకు భంగపాటు తప్పదని సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 211-231 స్థానాలు లభించే అవకాశాలు ఉండగా, యూపీఏ వందకు పైగా స్థానాలను కోల్పోయి, 107-127 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో జనవరి తొలి రెండు వారాల్లో సీఎన్ఎన్-ఐబీఎన్, లోక్నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన ఈ సర్వేలో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీకి ఓటు వేస్తామని 34 శాతం ఓటర్లు చెప్పగా, 27 శాతం ఓటర్లు మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సర్వే అంచనా వివరాలు...
- జనవరిలోనే లోక్సభకు ఎన్నికలు జరిగినట్లయితే, యూపీఏకు 28 శాతం, ఎన్డీఏకు 36 శాతం ఓట్లు లభిస్తాయి. ఇతరులకు మరో 36 శాతం ఓట్లు లభిస్తాయి.
- గడచిన ఆరునెలల్లో బీజేపీకి మద్దతు పలికే వారి సంఖ్య 7 శాతం పెరగగా, కాంగ్రెస్కు మద్దతు పలికే వారి సంఖ్య ఒక శాతం తగ్గింది.
- పల్లెల్లో కాంగ్రెస్ గణనీయంగా పట్టుకోల్పోయింది. గ్రామాల్లో బీఆజేపీకి 34 శాతం ఓటర్లు మద్దతు పలుకుతుండగా, కాంగ్రెస్కు 26 శాతం ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు.
- అట్టడు వర్గాల్లో 34 శాతం మంది బీజేపీకి మద్దతు పలుకుతుండగా, కాంగ్రెస్ వైపు 26 శాతం ఓటర్లు మాత్రమే మొగ్గు చూపుతున్నారు.
- ఎగువ మధ్యతరగతి ఓటర్లలో 37 శాతం, మధ్యతరగతి ఓటర్లలో 35 శాతం బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా, ఈ వర్గాల్లో కాంగ్రెస్కు 26, 29 శాతం మాత్రమే మద్దతు పలుకుతున్నారు.
- ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు శృంగభంగం తప్పదని ఈ సర్వే అంచనా వేసింది.