
ఈ బైకు ధర.. లక్షన్నర!
మహీంద్రా సంస్థ నుంచి వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'మోజో' బైకు విడుదలైంది. దీని ధర రూ. 1.58 లక్షలు
మహీంద్రా సంస్థ నుంచి వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'మోజో' బైకు విడుదలైంది. దీని ధర రూ. 1.58 లక్షలు (ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర). ఈ ధర దీపావళి వరకు మాత్రమే అమలులో ఉంటుందని మహీంద్రా సంస్థ చెబుతోంది. ఢిల్లీతో పాటు బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో ఒకేసారి ఈ బైకును విడుదల చేశారు. ప్రస్తుతానికి ఎంపికచేసిన పదిమంది డీలర్ల వద్దే ఈ బైకు దొరుకుతుంది. మొదటి వంద బైకులను ఇప్పటికే ముందుగా బుక్ చేసుకున్నవాళ్లకు ఇస్తున్నారు. తర్వాత బుక్ చేసుకోవాలంటే కొంతమంది డీలర్లు రూ. 10 వేలు, మరికొందరు రూ. 20 వేలుగా బుకింగ్ ధరను నిర్ధారించారు.
మోజో బైకు 295 సీసీ సింగిల్ సిలిండర్తో వస్తుంది. గంటకు గరిష్ఠంగా 147 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి పొడవైన వీల్ బేస్ ఉంది. దీంతోపాటు పిరెల్లీ డయాబ్లో రోసో 2 టైర్లు వస్తాయి. ఈ బైకు మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. గ్లేసియర్ వైట్, చార్కోల్ బ్లాక్, వల్కనో రెడ్ రంగుల్లో ఈ బైకు ఉంది. ప్రస్తుతం ఈ ధరలో కేటీఎం డ్యూక్ 200, హోండా సీబీఆర్250ఆర్ బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటితో మోజో పోటీ పడాల్సి ఉంటుంది.