భారత్‌పై పాక్‌ 'అణుబాంబు‌' అతడేనట! | Sakshi
Sakshi News home page

భారత్‌పై పాక్‌ 'అణుబాంబు‌' అతడేనట!

Published Tue, Oct 18 2016 3:52 PM

భారత్‌పై పాక్‌ 'అణుబాంబు‌' అతడేనట! - Sakshi

న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌కు చెందిన ఓ చాయ్‌వాలా అన్యూహంగా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నాడు. నీలికళ్లతో ఉన్న అతన్ని పాకిస్థాన్‌ అణ్వాయుధమని ఆ దేశ నెటిజన్లు నెత్తికెక్కించుకుంటున్నారు. పాకిస్థాన్‌లో భారత్‌ సర్జికల్‌ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడని, దెబ్బకు ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానం అయిపోతాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

చాయ్‌ అమ్ముతున్న ఈ నీలికళ్ల వ్యక్తి ఫొటోను జావేరియా  లేదా జియా అలీ అనే ఫొటోగ్రాఫర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటో వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రెండు నెలల కిందట జరిగిన ఫొటోవాక్‌లో భాగంగా ఇస్లామాబాద్‌లోని ఇత్వార్‌ బజార్‌ ప్రాంతంలో ఈ ఫొటో తీశానని, దానిని ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అనూహ్యమైన స్పందన వస్తున్నదని జియా అలీ మీడియాతో ఆనందం వ్యక్తం చేసింది.

చాయ్‌వాలా  (#ChaiWala) హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటో ట్విట్టర్‌ పాకిస్థాన్‌ ట్రెండింగ్‌లో టాప్‌ స్థానంలో నిలిచింది. ఇండియన్‌ కాఫీ వాలా (కరణ్‌ జోహార్‌) కంటే పాక్‌ చాయ్‌వాలా బెటర్‌ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్లు ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలే సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌ అంశాలుగా ఉండగా.. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ఈ పాక్‌ అణుబాంబు చాయ్‌వాలా.. ఒక్కసారిగా వాతావరణాన్ని సరదాగా మార్చేశాడు. ఈ ఫొటోపై భారతీయ నెటిజన్లు కూడా సరదా వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement