
మూడోరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డి జిల్లాలో మూడో రోజు ముగిసింది.
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డి జిల్లాలో మూడో రోజు ముగిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబ సభ్యులను బుధవారం షర్మిల ఓదార్చారు.
ఈ రోజు ఉదయం మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. సుగుణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రంగాపూర్లో కే కృష్ణారెడ్డి కుటుంబాన్ని, పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని, గొట్టిగఖుర్డులో అవుసల లక్ష్మణయ్య చారి కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు.
పరామర్శయాత్రలో తెలంగాణ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు భీష్మరవీందర్ తదితరులు పాల్గొన్నారు.