21 కి.మీ. రైలు మార్గం.. 44 కి.మీ. వాటర్‌ పైపు లైన్‌

Two huge structures completed in Singareni - Sakshi

     సింగరేణిలో పూర్తయిన రెండు భారీ నిర్మాణాలు

     15న ట్రయల్‌ రన్‌తో ప్రారంభం కానున్న రెండు నిర్మాణాలు 

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ సుమారు రూ.766 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు భారీ నిర్మాణాలను ప్రారంభించేందుకు ఆ సంస్థ చురు గ్గా ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరాకు అవసరమైన 21 కి.మీ రైలుమార్గం, రెండు టీఎంసీల నీటి సరఫరాకు సంబంధించి 44 కి.మీ పొడవైన పైపులైన్లను సింగరేణి సంస్థ నిర్మించింది. ఈ రెండు నిర్మాణాలను ఈ నెల 15న ట్రయల్‌రన్‌తో ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆ సంస్థ సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ మీడియాకు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంపై జరిగిన సమీక్షలో కొత్త నిర్మాణాల ట్రయల్‌ రన్‌కు సంబంధించి అధికారులతో చర్చించారు.  

ఏటా రూ.50లక్షల టన్నుల బొగ్గు సరఫరా 
కొత్తగా ప్రారంభించనున్న రైలు మార్గం ద్వారా ఏడాదికి అవసరమైన రూ.50 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనున్నారు. రూ.460 కోట్లతో రెండున్నరేళ్లలోనే ఇంత పొడవైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రైల్వే లైనుతో పాటు లోడింగ్, అన్‌ లోడింగ్‌ వద్ద సైడింగ్‌ తదితరాలకు మరో 20 కి.మీ. పొడవుగల రైలు మార్గాన్ని నిర్మించారు. 

రూ.306 కోట్లతో పైపులైను 
సింగరేణి సంస్థ రూ. 306 కోట్లతో 44 కి.మీ. పొడవైన పైపులైను ద్వారా ప్రాణహిత నది నుంచి సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. నీటి పంపింగ్‌ కోసం దేవులవాడ వద్ద 1,050 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు పంపులను, మార్గమధ్యంలో చెన్నూరు వద్ద 1,200 కిలోవాట్ల సామర్థ్యంగల మరో మూడు పంపులు ఏర్పాటు చేశారు. వీటితో గంటకు సగటున ఏడు వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని తీసుకునే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top