ఐఎస్బీతో గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ పథకం కింద ఔత్సాహిక గిరిజన యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలోని ఖేమ్కా ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి మహేశ్ దత్ ఎక్కా ప్రారంభించి మాట్లాడారు. హస్తకళలు, నగలు, సాంప్రదాయ కళాఖండాలను అభివృద్ధి చేసే నైపుణ్యంతో పాటుగా ఇంగ్లిష్పై పట్టు సాధించేలా గిరిజన యువకులకు శిక్షణ అందించాలన్నారు.
వీరిని సాన బెడితే కోహినూర్ వజ్రాలుగా తయారవుతారన్నారు. ఈ పథకం కింద ఆన్లైన్ ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా జెడ్ చోంగ్తు, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.