13న టీపీసీసీ నేతల ‘గోదావరి జలదీక్ష’ | TPCC Leaders Plans Godavari Jala Deeksha On 13th June | Sakshi
Sakshi News home page

13న టీపీసీసీ నేతల ‘గోదావరి జలదీక్ష’

Jun 10 2020 10:25 AM | Updated on Jun 10 2020 10:25 AM

TPCC Leaders Plans Godavari Jala Deeksha On 13th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిపై కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఈ నెల 13న సందర్శించి వాటి పురోగతి విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేస్తామని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయ న పార్టీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఫోన్‌ ద్వారా గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టులను సందర్శించి అక్కడ స్థానిక మీడియా తో ప్రాజెక్టు స్వరూపం గురించి మాట్లాడతామని తెలిపారు. (డబుల్‌’ పింఛన్లపై వేటు!)

ఈ సందర్భంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలమైన ఆదిలాబాద్‌ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీమంత్రి శశిధర్‌రెడ్డి, ఎల్లంపల్లి వద్ద ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, గౌరవెల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బల రాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, అలీసాగర్‌ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మండలిలో మాజీ విపక్ష నేత షబ్బీర్‌ అలీ దీక్షల్లో పాల్గొంటారని ఆయన ప్రకటనలో వివరించారు. (పరిశ్రమలకు పరిపుష్టి)

పోతిరెడ్డిపాడు పోరాట కమిటీ ఏర్పాటు 
ఇక కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తమ్‌ తెలిపారు. మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చైర్మెన్‌గా, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కన్వీనర్‌గా 12 మంది సభ్యులతో కమిటీని ఆయన ప్రకటించారు. కమిటీ సలహాదారులుగా సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యవహరిస్తారని, సభ్యులుగా మాజీమంత్రులు చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి, కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బాలునాయక్, టీపీసీసీ నేతలు లింగారెడ్డి, శ్రీహరి ముదిరాజ్, రామలింగయ్య యాదవ్, దొంగరి వెంకటేశ్వర్లు, సీహెచ్‌ ఎల్‌.ఎన్‌.రెడ్డిలను నియమిస్తునట్టు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement