రేపు సింగరేణి ఉద్యోగుల బకాయిల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులు, ఉద్యోగులకు 10వ వేతన సవరణ బకాయిల్లో 70 శాతాన్ని ఈ నెల 14న చెల్లించనున్నామని సంస్థ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 10వ వేతన సవరణ 2016 జూలై 1 నుంచి అమల్లోకి రాగా, సంస్థ నవంబర్ 2017 నుంచి కొత్త వేతనాలు చెల్లిస్తోంది. దీంతో జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల బకాయిలను చెల్లించాల్సి ఉంది.
కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేతన సవరణ బకాయిల్లో 70% చెల్లించాలని తాజాగా సంస్థ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేలు, పీఎఫ్, ఆదాయ పన్నులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మి కుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపింది. మిగతా 30 శాతం బకాయిలను కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం ప్రకారం చెల్లిస్తామని వెల్లడించింది.