టీఆర్‌ఎస్‌లోకి జయసుధ? | Tollywood actor Jayasudha to quit Congress for TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లోకి జయసుధ?

Jun 23 2015 3:40 AM | Updated on Mar 18 2019 7:55 PM

టీఆర్‌ఎస్‌లోకి జయసుధ? - Sakshi

టీఆర్‌ఎస్‌లోకి జయసుధ?

సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ సోమవారం కలకలం రేగింది.

కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారంతో కలకలం
సాక్షి, హైదరాబాద్: సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ సోమవారం కలకలం రేగింది. టీపీసీసీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న ఆమె.. పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆమె అధ్యక్షతన సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరగాల్సిన సమావేశం వాయిదా పడడం.. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి వెంటనే జయసుధతో మాట్లాడారు.

అనంతరం జయసుధ పార్టీని వీడడం లేదని, అవన్నీ వదంతులేనని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కసరత్తులో భాగంగా కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో జానారెడ్డి నేతృత్వంలో, జయసుధ అధ్యక్షతన సోమవారం సమావేశం జరగాల్సి ఉంది. కానీ జయసుధ తన తనయుడు హీరోగా రూపొందిన సినిమాకు సంబంధించిన కార్యక్రమం వల్ల పార్టీ సమావేశంపై దృష్టి కేంద్రీకరించలేపోయానని.. సమావేశానికి మరో తేదీ ఇవ్వాలని జానారెడ్డి, ఉత్తమ్, భట్టివిక్రమార్కలను కోరారు.

అయితే ఈ సమావేశం వాయిదాపడటంతో జయసుధ పార్టీని వీడుతున్నారని... టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోష్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇన్‌చార్జి నియామకం కోసం జానారెడ్డి నివాసంలో సమావేశం ఉంటుందని కూడా ప్రచారం జరిగింది.

జయసుధ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరుతారని గత ఎన్నికల ముందు నుంచే ప్రచారమున్న నేపథ్యంలో ఈ విషయంపై కొంతసేపు కాంగ్రెస్‌లో అలజడి చెలరేగింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి తదితరులు జయసుధతో మాట్లాడారు. పార్టీ వీడుతారంటూ జరుగుతున్న ప్రచారమేదీ వాస్తవం కాదంటూ జయసుధతో పాటు పార్టీ ముఖ్యనేతలు ప్రకటించారు.
 
అసంతృప్తితో జయసుధ?
టీపీసీసీ తీరుపై జయసుధ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తాజాగా సినిమా ఒత్తిడితో పాటు నియోజకవర్గస్థాయిలో పార్టీలోని పలు ఇబ్బందుల వల్ల సికింద్రాబాద్ సమీక్షా సమావేశానికి మరో తేదీ ఇవ్వాలని ఆమె కోరి నట్టు తెలిసింది. వాస్తవానికి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోష్‌కుమార్‌లను టీపీసీసీ స్థాయిలోని కొం దరు నేతలు తనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని ఆమె అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం.

ఇలా తనకు వ్యతిరేకంగా నేతలను ప్రోత్సహిస్తుంటే పార్టీని నియోజకవర్గంలో పటిష్టం చేయడం ఇబ్బందేనంటూ ఉత్తమ్, జానాలకు జయసుధ వివరించినట్టుగా తెలిసింది. తనకు పూర్తిస్థాయిలో బాధ్యతలను అప్పగించాలని, దీనిపై సమావేశంలో స్పష్టత ఇస్తానంటే.. పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
 
పార్టీలోనే ఉంటారు: భట్టి
జయసుధ కాంగ్రెస్‌లోనే ఉంటారని, కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క చెప్పారు. జయసుధపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, సస్పెండ్ చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఆమె పార్టీలో కొనసాగుతారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement