ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా | TMU Leaders Strike Infront Of Bus Bhavan In Nirmal | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా

May 5 2018 11:00 AM | Updated on May 5 2018 11:00 AM

TMU Leaders Strike Infront Of Bus Bhavan In Nirmal - Sakshi

ధర్నా చేస్తున్న టీఎంయూ నాయకులు

నిర్మల్‌అర్బన్‌ : జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూని యన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌.రమేశ్‌ డిమాండ్‌ చేశారు. వేతన సవరణపై యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, క్లరికల్, సూపర్‌వైజర్‌లతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.

పెంచిన కిలోమీటర్లను తగ్గించి, తగ్గించిన ఓటిని రన్నింగ్‌ టైమ్‌ను పునరుద్ధరించాలన్నారు. సర్క్యులర్‌ ప్రకారం రూటు సర్వే చేసి, రన్నింగ్‌ టైమ్‌ ఇవ్వాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సర్క్యులర్‌ 01/2018ని రద్దు చేయాలన్నారు. గ్యారేజీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాల ని, అధునాతన పనిముట్లు, విడిభాగాలు సరఫరా చేయాలన్నారు. తార్నాక హాస్పిటల్‌లో డాక్టర్లను నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

కాలం చెల్లిన రెగ్యులేషన్స్‌ మార్చాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన ‘చలో బస్‌ భవన్‌’ చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘం నాయకుడు కేఎంరెడ్డి, నిర్మల్‌ డిపో సెక్రెటరీ గంగాధర్, నాయకులు ఆర్‌ఎన్‌ రెడ్డి, పీవీఎస్‌రెడ్డి, శేఖర్, నారాయణ, అసదుల్ల, నర్సయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement