కుటుంబాన్ని పగబట్టిన విధి

Three Persons Died In Same Family In Karimnagar - Sakshi

ఏడాదిలో ముగ్గురు మృతి  

సాక్షి, జగిత్యాలక్రైం: ఆనందంగా సాగుతున్న కుటుంబంపై విధి పగబట్టింది. ఏడాదిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం గ్రామస్తులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా..జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సుందరగిరి కిషన్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు, కుమారుడు కాగా ఏడాది క్రితం వరకూ కుటుంబ జీవనం ఆనందంగా సాగుతూ వచ్చింది. ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు రఘు మృతిచెందడంతో విషాదం మొదలైంది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక కిషన్‌ భార్య ఉమ పది నెలలక్రితం ఆత్మహత్య చేసుకుంది. కిషన్, అతడి కూతురు సుందరగిరి మేఘన (22) మాత్రమే కుటుంబంలో మిగిలారు.

తమ్ముడు, తల్లి మృతిని తట్టుకోలేకపోయిన సుందరగిరి మేఘన మనస్తాపంతో బాధపడుతోంది. గురువారం రఘు జయంతిరావడంతో మేఘన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఇంట్లో తండ్రి లేని సమయంలో రేకులషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాదిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మేఘన చితికి నిప్పం టించిన కిషన్‌ రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులను కంటతడిపెట్టించాయి. కిషన్‌ను ఓదార్చే వారు లేకపోవడం..మేఘన మృతి సంఘటన విషాదం నింపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top