
ఔటర్...బహు దూర్
ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రాజెక్టు నిర్దేశిత గడువు ముగిసి ఐదు నెలలవుతున్నా... ఇంకా 33.3 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.
ప్రాజెక్టు పేరు : జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డు
మొత్తం నిడివి : 158 కి.మీ. (8 లేన్లు)
ప్రాజెక్టు వ్యయం : సుమారు రూ.ఏడు వేల కోట్లు
పనులు ప్రారంభించింది : 2006లో
నిర్దేశిత గడువు : 2012 నవంబర్
పొడిగించిన గడువు : 2013 డిసెంబర్ (ముగిసింది)
ప్రస్తుతం పూర్తయిన రోడ్డు : 125 కి.మీ.
అసంపూర్తిగా ఉన్న రోడ్డు : 33.3 కి.మీ.
ఎప్పటికి పూర్తవుతుంది? : చెప్పలేం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రాజెక్టు నిర్దేశిత గడువు ముగిసి ఐదు నెలలవుతున్నా... ఇంకా 33.3 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. అసలు ఈ ప్రాజె క్టు ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని అయోమయ పరిస్థితి ఎదురైంది. కారణాలేమైనా... ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా హెచ్ఎండీఏపై రూ.120 కోట్ల అదనపు భారం పడింది. అంటే... ఆ భారమంతా పరోక్షంగా ప్రజలపై పడ్డట్లే. శామీర్పేట నుంచి కీసర వరకు 10.3 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాకపోవడం ప్రాజక్టులో పనుల తీరుకు అద్దంపడుతోంది.
నిజానికి నిర్దేశిత గడువు ప్రకారం 2012 నవంబర్ నాటికి ఔటర్ రింగ్రోడ్డు మొత్తం 158 కి.మీ. నిర్మాణం పూర్తవ్వాలన్నది లక్ష్యం. అయితే... భూ సేకరణ విషయంలో కోర్టు వివాదాలు, విద్యుత్ హెచ్టీ లైన్లు, వాటర్ పైపులైన్లు తొలగించే విషయంలో సకాలంలో అనుమతులు మంజూరవక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకొంది. దీంతో ప్రాజెక్టు నిర్దేశిత గడువును 2013 డిసెంబర్ 30కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ గడువు కూడా ముగిసి ఐదు నెలలైనా ఔటర్ నిర్మాణం అంగుళం కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. అయితే.. ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు మాత్రంమిగిలిపోయిన ఔటర్ పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. మరి ఇదెలా సాధ్యమో... స్వల్ప కాలంలో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారన్నది వారికే తెలియాలి.
తడిసి మోపెడు..
ఔటర్ రింగురోడ్డు నిర్మాణ పనులు 2006లో ప్రారంభమైనా... ఇప్పటివరకు కేవలం 125 కి .మీ. రహదారి నిర్మాణం మాత్రమే పూర్తయింది. గత ప్రభుత్వం ఔటర్ గురించి పట్టించుకోక పోవడం.. అధికారులు లక్ష్యాన్ని గాలికి వదిలేయడం.. తదితర కారణాల వల్ల ఇప్పుడు ఖర్చు తడిసి మోపెడైంది. ప్రస్తుతం శామీర్పేట్-కీసర మార్గంలో 10.3 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. కాంట్రాక్టర్తో పనులు చేయించుకోవడం రాని అధికారులు నోటీసులిస్తూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడు పీకల మీదకు రావడంతో ఈ గండం నుంచి బయటపడేందుకు ఇటీవలే సదరు కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన (టెర్మినేట్) పలికారు.
మిగిలిపోయిన ఆ మార్గానికి మళ్లీ టెండర్లు పిలిచేందుకు తాజాగా ఎస్టిమేట్స్ (అంచనాలు) రూపొందించిన అధికారులకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. పాత టెండర్ ప్రకారం 10.3 కి.మీ మార్గంలో మిగిలిపోయిన పనులకు రూ.100 కోట్లు ఖర్చవుతుండగా, కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఆ పనులు పూర్తి చేయడానికి రూ.200 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. శామీర్పేట- కీసర 10.3 కి.మీ మార్గంతో పాటు కీసర-ఘట్కేసర్ మార్గంలో 11 కి.మీ.లు, ఘట్కేసర్-పెద్దఅంబర్పేట మార్గంలో 12 కి.మీ. మొత్తం 33.3 కి.మీ. మార్గం అసంపూర్తిగా ఉంది. అక్కడ ఇంకా 50 శాతం పనులు చేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. కీసర-ఘట్కేసర్, ఘట్కేసర్- పెద్దఅంబర్పేట మార్గంలో ప్రధాన రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి నూతన సంవత్సర కానుకగా వరంగల్-విజయవాడ జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తామని అధికారులు గతంలో ఆర్భాటంగా ప్రకటించారు.
మిగతా సర్వీసు రోడ్లు, జంక్షన్ల పనులు 2014 ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని గడువును కూడా ప్రకటించారు. అయితే...ఇంతవరకు ప్రధాన మార్గానికే దిక్కులేదు. ఇక సర్వీసు రోడ్లు, జంక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్ష్యాల మేరకు పనులు చేయనప్పుడు కాంట్రాక్టర్కు మొదట నోటీసులిచ్చి ఆ తర్వాత ఉద్వాసన పలకడం పరిపాటి. అయితే... రాజకీయ ఒత్తిళ్లు, అంతర్గత ఒప్పందాల వల్ల చర్యలు తీసుకొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కించారు. ఆ నిర్లక్ష్యం ఖరీదు రూ.120 కోట్లకు చేరింది. ఇదంతా పరోక్షంగా ప్రజలపై భారం పడ్డట్లే.
ఎస్కలేషన్ మోత
ఆలస్యం.. అమృతం విషమంటారు. సరిగ్గా ఔటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే జరిగింది. కోర్టు కే సుల వల్ల సమయానికి భూమిని అప్పగించక పోవడం, ఆర్వోబీకి సంబంధించిన డిజైన్ను సకాలంలో అందించకపోతే ఒప్పందంలోని నిబంధన ప్రకారం కాంట్రాక్టర్కు ఎస్కలేషన్ చెల్లించాలి. కండ్లకోయ జంక్షన్కు సుమారు రూ.15-18 కోట్ల వరకు ఎస్కలేషన్ చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఘట్కేసర్ జంక్షన్, ఆర్వోబీలకు సంబంధించి కూడా ఎస్కలేషన్ చెల్లించక తప్పని పరిస్థితి.
ఇలా ప్రాజెక్టులో జాప్యం వల్ల హెచ్ఎండీఏపై మరో రూ.20 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పుడు శామీర్పేట-కీసర పనులు చేయాల్సిన కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన పలకడం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.200 కోట్లకు పెరిగింది. దీనికి మళ్లీ టెండర్ పిలిచే విషయం ఇప్పుడు పెండింగ్లో ఉంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైలెవెల్ కమిటీ అనుమతి తీసుకొని టెండర్కు వెళ్లాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. అయితే... సంస్థపై అదనంగా పడ్డ భారానికి అసలు బాధ్యులు ఎవరన్నది కొత్త ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సి ఉంది.