తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు: లైవ్‌ అప్‌డేట్స్‌

Telangana Lok Sabha Results 2019 Live Updates - Sakshi

► తెలంగాణాలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 9 స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.
 విజేతలు వీరే:
1) అసదుద్దీన్‌ ఓవైసీ(ఎంఐఎం)- హైదరాబాద్‌
 2) బండి సంజయ్‌(బీజేపీ)-కరీంనగర్‌
3)నామా నాగేశ్వర రావు(టీఆర్‌ఎస్‌)-ఖమ్మం
4)మాలోతు కవిత(టీఆర్‌ఎస్‌)-మహబూబాబాద్‌
5) మన్నె శ్రీనివాస్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)-మహబూబ్‌నగర్‌
6)కొత్త ప్రభాకర్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)- మెదక్‌
7) పోతుగంటి రాములు(టీఆర్‌ఎస్‌)- నాగర్‌ కర్నూల్‌
8) ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(కాంగ్రెస్‌)-నల్గొండ
9)  వెంకటేశ్‌ నేత బోర్లకుంట(టీఆర్‌ఎస్‌)- పెద్దపల్లి
10) జి. కిషన్‌ రెడ్డి(బీజేపీ)- సికింద్రాబాద్‌
11) పసునూరి దయాకర్‌(టీఆర్‌ఎస్‌)- వరంగల్‌
12) ధర్మపురి అరవింద్‌(బీజేపీ)- నిజామాబాద్‌
13) ఎనుముల రేవంత్‌ రెడ్డి(కాంగ్రెస్‌)- మల్కాజ్‌గిరి
14) కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి(కాంగ్రెస్‌)-భువనగిరి
15) సోయం బాపూరావు(బీజేపీ)-ఆదిలాబాద్‌
16) బీబీ పాటిల్‌(టీఆర్‌ఎస్‌)-జహీరాబాద్
17)  జి.రంజిత్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌)- చేవెళ్ల

► జహీరాబాద్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ 5823 ఓట్ల ఆధిక్యతతో ముందంజ ఉన్నారు.

► నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో ఓటమి చెందారు.

► ఖమ్మం పార్లమెంటు స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర రావు, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరీపై 1,66,429 ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌కు 5 లక్షల 63 వేల 625 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,97,196 ఓట్లు, సీపీఎంకు 56,606 ఓట్లు, బీజేపీకి 20,327 ఓట్లు, జనసేనకు 19,245 ఓట్లు వచ్చాయి.

►మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌కు 2 లక్షల 68 వేల 428 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘనందన్‌ రావుకు లక్షా 95 వేల 13 ఓట్లు వచ్చాయి. ప్రభాకర్‌ రెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌పై 3 లక్షల 11 వేల 559 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

►మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజశేఖర్‌పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అసెంబ్లీలో ఘోర పరాయం పాలైన కాంగ్రెస్‌కు  లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఊరట నిచ్చాయి.

► భువనగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

► ఎన్నికల తర్వాత 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ ఆ దిశగా సాగడంలేదు. ఆ పార్టీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిట్టింగ్‌ ఎంపీ, కేసీఆర్‌ కుమార్తె ఓటమి దిశగా పయనిస్తుండటం టీఆర్‌ఎస్‌ వర్గాలను కలవరపెడుతోంది. ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్‌, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ మూడుస్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

► కరీంనగర్‌ పార్లమెంట్‌ 9వ రౌం‍డ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.  కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన పొన్నం ప్రభాకర్‌ 69,570, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ 1,58,374, బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్‌ 2,13,602 ఓట్లు సాధించారు.

► మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి 10వ రౌండ్‌లో 3177 ఆధిక్యంలో ఉన్నారు.

►ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి నామానాగేశ్వరరావు రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఐదువేల పైచిలుకు మెజారిటీలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్ కవిత మొదటిరౌండ్‌ పూర్తయ్యే సరికి 8500 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

►తెలంగాణ వ్యాప్తంగా జోరుమీదున్న టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌లో వెనకంజలో ఉంది. కేసీఆర్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపీ కవిత ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ముందంజలో కొనసాగుతున్నారు. 160 మందికిపైగా రైతులు ఇక్కడ పోటీ చేయడంతో బ్యాలెట్‌ పద్దతిలో పోలింగ్‌ నిర్వహించిన సం‍గతి తెలిసిందే.

► మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిదిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి స్పష్టమైన మెజారిటీ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన 65 వేల పైచిలుకు మెజారిటీలో కొనసాగుతున్నారు.

► తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్‌‌, జహీరాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, పెద్దపల్లి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఆదిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఎంఐఎం ఆదిక్యంలో ఉంది.

► తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్‌ 11న) పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top