ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడుల శకం నడుస్తుందని, ఎక్కడ అనుకూల వాతావరణం ఉంటే అక్కడే పెట్టుబడులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడుల శకం నడుస్తుందని, ఎక్కడ అనుకూల వాతావరణం ఉంటే అక్కడే పెట్టుబడులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమేనని అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం బిల్లు రూపకల్పనపై ఉన్నతాధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సచివాలయంలో కసరత్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, కొన్ని ప్రభుత్వాలు సైతం ఇందుకు ముందుకొస్తున్నాయని అన్నారు.
ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణలో పరిశ్రమలకు అనువైన వాతావరణం, తక్కువ ధరల్లో లభించే భూములు, అపారమైన మానవ వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి తోడు మంచి పారిశ్రామిక విధానం వస్తే హైదరాబాద్కు, ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ ఎండీ జయేష్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.