సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ప్రజాభవన్లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల తరఫున హులికుంటే మూర్తి, డా. ఆశ్నా సింగ్, వి.మృదుల, రాహుల్ పాల్గొన్నారు. హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వెముల’ ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ, ప్రొఫెసర్ తిరుమల్, ప్రొఫెసర్ రత్నం, వి. రఘునాథ్, డా డోంత ప్రశాంత్, తిరుపతి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.


