చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు | Telangana Elections Congress And TRS Leaders Warangal | Sakshi
Sakshi News home page

చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు

Nov 16 2018 8:15 AM | Updated on Nov 30 2018 10:36 AM

Telangana Elections Congress And TRS Leaders Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా వలసలకు గిరాకీ పెరిగింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్యచరణ ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. వారి స్థోమతను బట్టి వేల నుంచి లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు గ్రామాల్లో చర్చ జరుగుతుంది. గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

అందులో భాగంగానే ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచే బేరసారాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో తమ బలబలాలను నిరూపించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరకాల, నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో పోటాపోటీ చేరికలు జరుగుతున్నాయి. దీంతో నయానో బయానో చెల్లించుకుని తమ ఉనికిని చాటుకునేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ప్రత్యర్థులు పోటీపడుతున్నారు.

చేరితే ఓ రేటు.. మద్దతు ఇస్తే మరో రేటు 
అందులో భాగంగానే గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులు ప్రత్యర్థి పార్టీలకు చెందిన   శ్రేణులకు రాయభారం జరిపి అనంతరం జిల్లా కేంద్రంలో చేరికలు, మద్దతు తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరితే ఒక రేటు, మద్దతు ఇస్తే మరోరేటు ఇచ్చే విధంగా మాట్లాడుతన్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు, తాయిలాలు, బహుమతులను కొంతమందికి ఇస్తుండగా మరికొంత మందికి రాననున్న రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీల వంటి ప్రజా ప్రతినిధి వంటి అవకాశాలతో పాటు పలు రాయకీయ పదవులను ఆశ చూపుతున్నారు.

నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు కొనసాగగా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కుడా రాయభారం పస్తుందని రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలి యని పరస్థితి ఉన్నదని చెబుతున్నారు. ఏది ఏమైనా గ్రామాల్లో నాయకులకు గిరాకీ ఏర్పడిందని కొందరు చెబుతుండగా, నాయకులు అభ్యర్థుల వెంట తిరిగిన వారిని చూసి ఓట్లు వేసే రోజులు లేవని మరికొందరు చెప్పుకోవడం గమనార్హం.

పోటాపోటీగా..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలలో పోటాపోటీగా చేరికలు కోనసాగుతున్నాయి. కొంత పలుకుబడి ఉన్న నాయకుడు పార్టీ మారకుండా ఉండేందుకు తరచూ పలకరిస్తున్నారు. పార్టీ మారకుండా ఉండాలంటే కొందరు నాయకులు డబ్బులను సైతం డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారం ఖర్చు కంటే నాయకులను కాపాడుకునేందుకే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బరిలో నిలుస్తున్న నేతలు జంప్‌ జీలనీలతో తలలు పట్టుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement