రేషన్ దుకాణాల్లో టీవాలెట్‌

T Wallet Used In Ration Shops At Vikarabad - Sakshi

నేటినుంచి అమలుకు శ్రీకారం

డీలర్లకు ఆర్థిక చేయూత దిశగా సర్కారు నిర్ణయం 

ఈ– పాస్‌ యంత్రాల్లో యాప్‌ నిక్షిప్తం

సాక్షి, వికారాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో నూతనంగా టీ వాలెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వినియోగంపై ఇప్పటికే జిల్లాలోని డీలర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ యాప్‌ను వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎనిమిది రకాల సేవలు అందించనున్నారు. డీలర్లకు కమీషన్‌ పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 18 మండలాల్లో 587 రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 2.34 లక్షల మంది కార్డుదారులకు ప్రతి నెల 5,356 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం జిలాల్లోని అన్ని దుకాణాల్లో టీవాలెట్‌ను అమలు చేయనున్నారు. కొన్ని గ్రామాల్లో సిగ్నల్‌ సమస్య ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌ను వినియోగించి.. టీవాలెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే డీలర్ల వద్దనున్న ఈ– పాస్‌ మిషన్లలో యాప్‌ను వేయించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

8రకాల సేవలు...  
టీవాలెట్‌ ద్వారా నూతనంగా ఎనిమిది సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. మీ సేవ, విద్యుత్, ఆర్టీ, నగదు జమ, సెల్‌ఫోన్‌ రీచార్జ్, డీటీహెచ్‌ రిచార్జ్, ఇంటి పన్ను చెల్లింపు, బస్సు టికెట్‌ బుక్కింగ్‌లు వంటి సేవలు దీనిద్వారా పొందవచ్చు. బ్యాంకులతో అనుసంధానంగా లబ్ధిదారులకు ఈ సేవలు అందనున్నాయి. భవిష్యత్‌లో ఉపాధిహామీ, పెన్షన్‌ చెల్లింపులకు, ఈ యాప్‌పు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీవాలెట్‌తో బ్యాంకులకు నగదు బదిలీలు, స్వయంసహాయ సంఘాల రుణాల చెల్లింపులు జరిగేలా చూస్తారు. ప్రస్తుతం రేషన్‌ డీలర్లు 1వ తేదీ నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. టీవాలెట్‌ అమలైతే నెల రోజుల పాటు వీరి సేవలు కొనసాగించనున్నారు. దీంతో డీలర్లకు ఆర్థిక చేయూత అందనుంది.

కమీషన్‌ పెంచేందుకే... గత కొన్ని రోజులుగా రేషన్‌ డీలర్ల 
తమ కమీషన్‌ పెంచాలని లేదా వేతనాలు ఇవ్వాలని పలుమార్లు సమ్మెకు దిగే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రతీసారి వీరిని బుజ్జగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో డీలర్లకు ఏవిధంగానైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో టీవాలెట్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పలు రకాల సేవలు అందుబాటులోకి రావడంతో పాటు రేషన్‌ డీలర్లకు ఆర్థిక చేయూతకల్పించినట్లు ఉంటుందని సర్కారు భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top