స్వచ్ఛ జిల్లాగా మారుద్దాం | swetha mahanthi speech at gandhi jayanthi programme | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ జిల్లాగా మారుద్దాం

Oct 3 2017 1:56 PM | Updated on Mar 21 2019 8:29 PM

swetha mahanthi speech at gandhi jayanthi programme - Sakshi

వనపర్తి : బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా వనపర్తిని మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ముఖ్యంగా ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ శ్వేతామహంతి పిలుపునిచ్చారు. ముందస్తు లక్ష్యం ప్రకారం మహాత్మాగాంధీ జయంతి నాటికి జిల్లాలోని 34 గ్రామాలను ఓడీఎఫ్‌ గ్రామాలుగా తీర్చిదిద్దామని, ఇదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనిచేయాలని ఆదేశించారు. సోమవారం వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించారు.

ఒడీఎఫ్‌ గ్రామంగా గుర్తించి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ..మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేయించుకోవాలన్నారు. మరుగుదొడ్డి లేని ఇంట్లో నివసించే వారు ఏటా అనారోగ్యం కారణంగా రూ.30 వేలకు పైబడి డబ్బును వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైందని తెలిపారు. ఒక్క సంవత్సరం వైద్యం కోసం చేసే ఖర్చులో సగం డబ్బులు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆరోగ్యంతో పాటు డబ్బుకూడా ఆదా అవుతుందని కలెక్టర్‌ సూచించారు.

స్వచ్ఛత ప్రజల చేతుల్లోనే.. : ఎమ్మెల్యే చిన్నారెడ్డి
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పేదలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ జి. చిన్నారెడ్డి సూచించారు. భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. స్వచ్ఛ ఎవరివల్లో సాధ్యం కాదని, అది ప్రజల చేతుల్లోనే ఉంటుందన్నారు. అనంతరం బహిరంగ మలవిసర్జన వలన కలిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో డీపీఓ వీరబుచ్చయ్య, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, సర్పంచు ప్రభావతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement