కేసీఆర్‌తో భేటీ: కీలక ప్రతిపాదనలు సిద్ధం! | Sakshi
Sakshi News home page

సీఎంతో రవాణా శాఖ అధికారుల భేటీ

Published Mon, Oct 7 2019 1:22 PM

Sunil Sharma Committee Meeting With CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. సీఎం ఆదేశాల మేరకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిటీ నేడు సీఎం ముందు వాటిని ఉంచనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో రవాణా శాఖ మరోసారి భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో వీరి మధ్య సమావేశం ప్రారంభమైంది. ఆర్టీసీ బలోపేతం, భవిష్యత్‌ కార్యచరణపై విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆర్టీసీపై సునీల్‌ శర్మ కమిటీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏఏ కేటిగిరికి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటిగిరిలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని ఆయన అన్నారు. ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అన్నారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని అధికారును ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీలో కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నందన్నది ఆసక్తికరంగా మారింది.
 

Advertisement
Advertisement