ఓయూలో విద్యార్థుల ర్యాలీ... ఉద్రిక్తత | students rally in ou campus | Sakshi
Sakshi News home page

ఓయూలో విద్యార్థుల ర్యాలీ... ఉద్రిక్తత

Feb 5 2015 2:10 PM | Updated on Nov 9 2018 4:51 PM

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు గురువారం డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు గురువారం డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులు ఓయూ క్యాంపస్ నుంచి తార్నాక చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... తెలంగాణ  రాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఎదురుచూసిన తమకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం నిబంధనల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గ్రూప్ - 2 ఉద్యోగాలను గ్రూప్ -1లో కలపడం ఎంతవరకు సమంజసమని ఓయూ విద్యార్థులు ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగాల నియామకాలపై వెంటనే ఓ నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement