కేయూలో విద్యార్థుల రాళ్ల దాడి | students attack in Kakatiya university | Sakshi
Sakshi News home page

కేయూలో విద్యార్థుల రాళ్ల దాడి

Jan 23 2015 9:57 PM | Updated on Nov 9 2018 4:52 PM

కాకతీయ యూనివర్సిటీలో భోజనం అందలేదని కారణంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో భోజనం అందలేదని కారణంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.  శుక్రవారం క్యాంపస్లోని ప్రతాపరుద్ర మెస్‌కు సంబంధించిన పీజీ ఫస్టియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ప్రైవేట్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదని మూడురోజలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు  ఆ కాంట్రాక్టర్‌ను  తప్పించారు. క్యాంపస్ కామన్ మెస్‌లోని మరో కాంట్రాక్టర్‌తో వంటచేయించి ప్రతాపరుద్ర మెస్‌కు మధ్యాహ్నం భోజనం పంపారు. 400 మంది విద్యార్థుల్లో కొందరికి మాత్రమే భోజనం సరిపోయింది. దీంతో భోజనం అందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండ్లు కూడా ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దామోదర్‌రావుకు చెందిన కారుఅద్దాలు  ధ్వంసమయ్యూయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు దాడి చేశారో వారంతట వారే స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించగా... సుమారు 150 మంది విద్యార్థులు కేయూ పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. మరోవైపు కేయూలోని హాస్టళ్లు, మెస్‌లను శనివారం నుంచి మూసివేయాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. పీజీ కోర్సుల ఫస్టియర్ విద్యార్థులకు ఇప్పటికే రెండు పరీక్షలు జరిగాయిజ మిగతా పరీక్షలను నిరవధికంగావాయిదా వేస్తున్నామని, పీజీ తరగుతులన్నీ రద్దుచేసినట్లు కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement