
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్ ఫోటో)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకాలంలో సంక్షేమ వైభవం పరిఢవిల్లింది. విద్యార్థి నుంచి వృద్ధుల వరకు, రైతు నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ లబ్ధి చేకూరింది. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో రైతులను ఆదుకుని.. ఒక విప్లవాత్మక మార్పునకు నాందిపలికారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించారు. ఆయన హయాంలో ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది లబ్ధిపొందారు. వైఎస్సార్ అందించిన ఆసరాతో విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆరోగ్యశ్రీ పథకంతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. నేడు( జూలై 8) వైఎస్ జయంతి. ఈ సందర్భంగా మహానేత అమలు చేసిన సంక్షేమ ఫలాలను గుర్తుచేసుకుందాం.
4.52 లక్షల మందికి రుణమాఫీ
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల పంట రుణాలు మాఫీ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి, పంటల సాగుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి ఆ దిశగా 2008లో ఒకేసారి రుణమాఫీని చేసి తిరిగి రైతులకు రుణాలు ఇచ్చారు. రుణాలను క్రమం తప్పకుండా చెల్లించి బ్యాంకుల్లో బకాయిలు లేని రైతులకు కూడా... ప్రయోజనం ఉండాలనే లక్ష్యం తో దాదాపు 70 వేల మంది రైతులకు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకాలను అందించారు. రుణమాఫీ, ప్రోత్సాహకాలు రైతుల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపాయి. వ్యవసాయం పండగలా మారింది.
‘సీతారామ’కు అప్పుడే బీజం
అశ్వాపురం: 9 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి వైఎస్ హయాంలోనే బీజం పడింది. జలయజ్ఞంలో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా రాజీవ్సాగర్కు రూపకల్పన చేశారు. దివంగత నేత కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ పనులు కూడా కొంత వరకు జరిగాయి. వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్ట్ల రీడిజైన్లో భాగంగా రాజీవ్సాగర్ను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్గా నామకరణం చేశారు.
31,961 మందికి పోడు హక్కులు
భద్రాచలం: ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ శాఖ అధికారుల వేధింపులు నిత్యకృత్యంగా ఉండేవి. వాటì నుంచి అడవి బిడ్డలకు విముక్తి కల్పించేందుకు ఉమ్మడి జిల్లాలో 31,961 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 2008 నుంచి 2010 వరకు 38 ఏజెన్సీ మండలాల్లో డీఎల్సీ ఆమోదం పొందిన 2.10 లక్షల ఎకరాలను పంపిణీ చేశారు. ఆ భూములపై ప్రస్తుతం రూ. 31.67 కోట్ల మేర రైతుబంధు సాయం కూడా పొందారు.
హక్కు పత్రాలను అందిస్తున్న వైఎస్(ఫైల్)
నాకు పునర్జన్మ ప్రసాదించారు
సత్తుపల్లిటౌన్: మాది నిరుపేద కుటుంబం. చికెన్షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు 2013లో గుండెనొప్పి వచ్చింది. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్తే గుండెలో వాల్వ్ సమస్య ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్కు రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీకార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో ఒక్క రూపాయి కూడా కట్టకుండా గుండె ఆపరేషన్ చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే నాకు పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు బతికి ఉన్నానంటే రాజన్న పుణ్యమే. ప్రతీ ఏటా మహానేత జయంతిని ఇంటిల్లిపాది కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరుపుకుంటాం. –రాగం సత్యనారాయణ, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించారు..
సూపర్బజార్(కొత్తగూడెం): వైఎస్ చలవతో కొత్తగూడెం మున్సిపాలిటీలోని ప్రజలు తమ ఇళ్ల స్థలాలపై హక్కులు పొందారు. సింగరేణి లీజు స్థలాలు అని, ఎవరికీ స్థలాలపై హక్కులేదని, క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశం లేదని ప్రచారాలు వెళ్లువెత్తుతున్న తరుణంలో స్థానికులు ఆందోళన చెందారు. వైఎస్ ఇక్కడ పర్యటించినపుడు ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. క్రమబద్ధీకరించేందుకు 373 జీఓను విడుదల చేశారు. 100 గజాలలోపు ఉన్న వారికి ఉచితంగా, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి కొం త రుసుంతో ఇంటి స్థలాలు క్రమబద్ధీ కరించాలని ఆదేశించారు. దీంతో సుమారు 4 వేల మంది లబ్ధిపొందారు. ఆ తర్వాత పక్కా భవనాలు నిర్మించుకున్నారు. రుణాలూ పొందారు.
గిరిపుత్రికలకు వరం..
దమ్మపేట: అంకంపాలెంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మ డి జిల్లా నుంచి గిరిజన విద్యార్థినులు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకునేవారు. టెన్త్ కాగానే ఇంటర్ విద్యకోసం పిల్లలను దూర ప్రాంతాలకు పంపి చదివించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ద్వారా వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అంకంపాలేనికి గిరిజన బాలికల జూనియర్ కళాశాలను మంజూరు చేశారు. 2006లో కళాశాలను ప్రారంబించారు. రూ. 3.30 కోట్లతో 2007 జనవరి 27న కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ శంకుస్థాపన చేశారు. 2013లో భవనం పూరై్త ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు 2500 మంది విద్యార్థినులు ఇక్కడ ఇంటర్ పూర్తి చేశారు.
ఇల్లెందులో సంక్షేమం ఇలా..
ఇల్లెందు: ఇల్లెందు మండలం, పట్టణంలోనే వైఎస్ హయాంలో సంక్షేమ పాలన తీరు ఇలా ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇల్లెందు పట్టణ, మండలంలో 104343 మంది జనాభా ఉంది. ఇల్లెందు మండలంలో 5292మందికి నెలకు రూ. 200 పింఛన్, 470 మందికి నెలకు రూ. 500 పింఛన్ అందించారు. మున్సిపాలిటీలో 2174 మందికి నెలకు రూ. 200 పింఛన్, 268 మందికి నెలకు రూ. 500 పింఛన్ చెల్లించారు. ఇందిరమ్మ గృహాలు 9088 పూర్తి కాగా, 7342 నిర్మాణంలో ఉన్నాయి. పావలావడ్డీ పథకం కింద 1327 గ్రూపులకు 1893.77 లక్షలు బ్యాంకు లింకేజీ, 37.97 లక్షలు పావలావడ్డీ లభించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 19,736మ మందికి కార్డులు జారీ చేయగా 105 మంది, రూ.33.61లతో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకంలో 6966 మంది విద్యార్థులు రూ.148.1 లక్షలు పొందారు. పశుక్రాంతి పథకంలో 98 మంది రైతులకు రూ. 43.40 లక్షల సబ్సిడీతో 124 పశువులను అందజేశారు.
పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు..
అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఆయిల్ఫాం గెలలను ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు తరలించాల్సి వచ్చేది. దీంతో రవాణా వ్యయం అధికంగా ఉండేది. అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే జలగం వెంకటరావు ద్వారా సమస్యను వైఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో.. 2005లో అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ పరిశ్రమను స్థాపించారు. దీంతో ఆయిల్ పామ్ సాగు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే 30వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ క్రమంలోనే దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మించారు.
బతికున్నానంటే ఆయన పుణ్యమే
సూపర్బజార్(కొత్తగూడెం): ఈరోజు బతికున్నానంటే వైఎస్ పుణ్యమే. పోయిన ఏడాది సంక్రాంతికి ముందురోజు గుండెనొప్పి వచ్చింది. డాక్టర్ నాగరాజు వద్దకు వెళ్లగా పరీక్షలు నిర్వహించి వెంటనే హైదరాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లమన్నారు. బట్టలషాపులో గుమస్తాగా పనిచేసే నాకు హైదరాబాద్కు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమతలేదని చెప్పాను. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదా అని అడిగారు. ఉందని చెప్పాను. ఆ కార్డు ఉంటే ఉచితంగా వైద్య సేవలందుతాయని డాక్టర్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులలో విన్పిస్తూనే ఉన్నాయి. వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లాను. డాక్టర్ ఆపరేషన్ చేసి స్టంట్ చేశారు. వైఎస్సార్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డే నా ప్రాణాన్ని నిలబెట్టింది. ఆపద్భాంధవుడైన వైఎస్ఆర్ను దేవుడు ఇంత తొందరగా తీసుకువెళ్తాడని ఉహించలేదని చెమర్చిన కళ్లతో కొమరయ్య పేర్కొన్నాడు.
–బేరి కొమరయ్య, కూలీలైన్, కొత్తగూడెం
ఎన్నటికీ మరువలేం
ఎర్రుపాలెం: నాకు 62 ఏళ్లు. పేదరికంతో బతుకుతున్నాను. ఏడాది క్రితం గుండె జబ్బు వచ్చింది. ఆస్పత్రికి పోతే మూడు వాల్వులు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆరోగ్య శ్రీ కార్డుతో హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్లో గుండెకు వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. లక్షా 11 వేల 346 మంజూరు చేసింది. నాకు రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఈ పథకం లేకపోతే అప్పులు చేసి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఆరోగ్య శ్రీ పథకం పేదలకు గొప్ప వరం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎన్నటీకీ మరవలేం.
–షేక్ జానీమియా, పెద్ద గోపవరం, ఎర్రుపాలెం మండలం