‘సాక్షి’ కృషి అభినందనీయం : హరీష్ రావు
అతివల భద్రతపై ‘సాక్షి’ ప్రత్యేక పుస్తకం
కర దీపికలా సమస్త సమాచారం
రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరించిన మంత్రులు, జడ్జీలు
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ శివారులో గత ఏడాది చివరలో జరిగిన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేసిన నేపథ్యంలో పిల్లలు, మహిళల రక్షణకు సంబంధించి ఉన్న చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు.. ‘దిశా నిర్దేశం’చేసేందుకు ‘సాక్షి’ప్రయత్నం చేసింది. సంబంధిత నిపుణుల సలహాలు.. పర్యవేక్షణలో పుస్తకానికి రూపకల్పన చేసింది.
(చదవండి : దిశా చట్టం అమలుకు సర్వం సన్నద్దం)
ఇందులో పిల్లలు, మహిళలకు సంబంధించిన అన్ని చట్టాలు, హక్కులు, ఆపద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకోని ఆపద వస్తే అనుసరించాల్సిన పద్ధతులు, హెల్ప్ లైన్లు, పొందాల్సిన పోలీస్ సాయం, న్యాయ సలహాలు, భరోసా సెంటర్లు, షీ టీమ్ వ్యవస్థ, మహిళల భద్రత కోసం ఉన్న యాప్స్, వారి ఆత్మరక్షణ కోసం ఉన్న ఆయుధాలు తదితర సమస్త సమాచారాన్ని పొందుపరిచింది. మహిళల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ హ్యాండ్ బుక్గా వినియోగించుకునేలా, ప్రతి ఇంట్లో ఒక లీగల్ గైడ్లా ఉండేలా పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకాన్ని శనివారం తెలంగాణవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, న్యాయమూర్తులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు ఆవిష్కరించారు. పుస్తకం బాగుందని కితాబిచ్చారు. ‘సాక్షి’ప్రయత్నాన్ని అభినందించారు.
హ్యాండ్ బుక్లా పనికొస్తుంది..
సాక్షి, సంగారెడ్డి: మహిళల హక్కులపై దిశానిర్దేశం అనే పుస్తకాన్ని ప్రచురించి చట్టాలపై వారికి అవగాహన కల్పించడానికి ‘సాక్షి’చేసిన కృషి అభినందనీయం. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినప్పు డు చట్టాలపై అవగాహన ఉంటే న్యాయ సాయం సులువవుతుంది. ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ చాలా మందికి తెలియదు. మహిళల హక్కులను తెలియజేసే సమాచారాన్ని అందించడం మంచి పరిణామం. ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం హ్యాండ్ బుక్లా పనికొస్తుంది.
– హరీశ్రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి