రోడ్ల మరమ్మతులకు రూ.124 కోట్లు | Rs 124 crore for road repairs | Sakshi
Sakshi News home page

రోడ్ల మరమ్మతులకు రూ.124 కోట్లు

Nov 30 2014 4:34 AM | Updated on Sep 2 2017 5:21 PM

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో, అంతర్ జిల్లాలను కలుపుతూ రహదారుల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం ..

టెలీమీట్‌లో మంత్రి హరీష్ వెల్లడి

సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో, అంతర్ జిల్లాలను కలుపుతూ రహదారుల మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 124.25 కోట్లను మంజూరు చేసిందని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు.  శనివారం రాత్రి ఆయన టెలీమీట్‌లో నిధులను వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. జీఓ నం. 129, 130, 131 ప్రకారం మెదక్, కరీంనగర్, వరంగల్ రహదారులను కలుపుతూ, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రధాన రోడ్ల మరమ్మతుకు నిధులు విడుదలయ్యాయన్నారు.

ప్రధానంగా డబుల్ రోడ్లు, నాలుగు లేన్ల రోడ్ల విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. సిద్దిపేట బైపాస్ గుండా నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం రూ. 50 కోట్లు, నంగునూరు నుంచి ఖాతా వరకు డబుల్ రోడ్ నిర్మాణం కోసం రూ. 8.5 కోట్లు, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు ప్రస్తుతం రూ. 10 కోట్లతో జరుగుతున్న డబుల్‌రోడ్ నిర్మాణాన్ని పొడిగించేందుకు 3 కిలో మీటర్ల రహదారి కోసం ప్రభుత్వం రూ. 3.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

అదే విధంగా ఇబ్రహీంపూర్ నుంచి మాచాపూర్ వయా చింతమడక నుంచి దుబ్బాక వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 12 కోట్లు, అదే విధంగా జక్కాపూర్ నుంచి గోపులాపూర్, మాటిండ్ల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, చింతమడక మీదుగా మెదక్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం కోసం రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. పొన్నాల బైపాస్ నుంచి ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల వయా తిమ్మారెడ్డిపల్లికి రూ. 25 కోట్లు మంజూరయ్యాయన్నారు. సిద్దిపేట నుంచి తొగుట రహదారి మార్గమధ్యలో ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2 కోట్లను రహదారుల శాఖ ద్వారా నిధులు మంజూరయ్యాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement