
వేములవాడఅర్బన్: వేములవాడ నియోజకవర్గంలో కొత్త ఓటర్లుకు ఎన్నికల కమిషన్ ద్వారా త్వరలోనే గుర్తింపు కార్డులను అందిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. వేములవాడ తహసీల్ధార్ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 235 పోలింగ్ కేంద్రాలలోని ప్రతీ ఓటరుకు పోలింగ్ రశీదును అందిస్తామన్నారు. ఈ రశీదులో ఓటరు పేరు, క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతం, పోలింగ్ భవన చిత్రం ఉంటుందన్నారు. అందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఈనెల 9 నాటికి 4,745 మంది నూతనంగా ఓట హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ఇందులో 4,161 మందికి ఓటు హక్కు కల్పించామని, 121 దరకాస్తులను తిరస్కరించామన్నారు. మిగతా వాటిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి ఓటు హక్కును కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికి జాబితా ఏర్పాటు చేసినందున నూతనంగా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం ఈ నెల 18న మరో జాబితాను విడుదల చేసి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా ఓటర్లు పెరిగారని, వారందరికి గుర్తింపు కార్డులను కూడా త్వరలోనే వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల వద్ద ఉంచుతామన్నారు. తహసీల్దార్ నక్క శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.