లక్షణాల్లేని వారి నుంచే సంక్రమణ..
80 శాతం మంది మాస్కులు ధరిస్తేనే వైరస్ అదుపులోకి
ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్ కొండల్రెడ్డి
భసాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకినా, దీనికి సంబంధించిన దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు లేనివారి నుంచే 74 శాతం మేర ఇతరులకు సంక్రమించే అవకాశాలున్నాయని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండల్ రెడ్డి తెలిపారు. కొందరు మాత్రమే మాస్కులు ధరించడం వల్ల ప్రయోజనం లేదని, ఈ లక్షణాలున్నా లేకపోయినా అందరూ మాస్క్లు వాడితేనే ఈ వైరస్ సోకకుండా, వ్యాప్తి చెందకుండా నివారించొచ్చని చెప్పారు. ఈ విధంగా 80 శాతం మంది మాస్కులు ధరిస్తే కరోనాను పూర్తిగా అరికట్టవచ్చునన్నారు.
బుధవారం ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో పల్మనాలజిస్ట్ దివ్యేష్ వ్యాఘ్రేతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతోందని, బయటికి వెలువడ్డాక గాలిలో 3 గంటలు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇది చేతులకు తగిలి నోటికి, ముక్కు, కళ్ల ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. అరవై ఏళ్లు పైబడిన వారు, గుండె, ఆస్తమా, కిడ్నీ, డయాబెటీస్, బీపీ ఉన్నవారు ఇళ్లలోంచి బయటకు రాకపోవడమే మంచిదని స్పష్టంచేశారు. షుగర్, బీపీ పేషెంట్లు అవి కంట్రోల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా సమస్యలున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పల్మనాలజిస్ట్ దివ్యేష్ వ్యాఘ్రే తెలిపారు.