పునఃనిర్మాణం పేరుతో రాష్ట్రంలో పురాతన ఆలయాల కూల్చివేతలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
హైదరాబాద్: పునఃనిర్మాణం పేరుతో రాష్ట్రంలో పురాతన ఆలయాల కూల్చివేతలపై ప్రభుత్వం నిషేధం విధించింది. పురాతన ఆలయ సంపదను కాపాడుకునే ఉద్దేశంతో రాష్ట్ర దేవాదాయ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వందేళ్ల కిత్రం నిర్మించిన ఆలయాలను ప్రభుత్వం, ఏపీ ధార్మిక పరిషత్ అనుమతి లేకుండా కూల్చవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఆలయ శిధిలావస్థకు చేరిన పరిస్థితులు ఉంటే దాని స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయని విధంగా ఆలయాన్ని కాపాడేందు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
రాతికట్టడాలతో ఉన్న ఆలయ గోడలకు రంగులు వాడడంపై నిషేధం విధించారు. ఆలయ అభివృద్ధికి దాతలు చేసిన దానాల వివరాలను గోడలపై రాయడం కాకుండా అందుకు సంబంధించిన వివరాలను ఆలయ రికార్డుల్లో మాత్రమే ఉంచాలని సూచించారు. దాతలు ఇచ్చిన ఫ్యాన్లు, వాటర్ కూలర్లు వంటి వాటిపై సైతం వారి పేర్ల నమోదు చేయకుండా అందుకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో భద్రపరచాలన్నారు.