కష్టాల కొండయ్య
భద్రాచలంఅర్బన్ : పట్టణ ఆదర్శనగర్లో నివాసముంటున్న సేగు కొండయ్య దాతల కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనిది లేచి నిలబడలేని స్థితి. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేడు. ఒకప్పుడు పాత మార్కెట్ ఏరియాలో హోటల్ నడిపిన అతను, కాల క్రమేణ ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మూసివేశాడు. కొంత కాలం క్రితం అనారోగ్యంతో భార్య సీతమ్మ చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లై వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయాడు.
తన మరదలు ఇప్పుడు కొండయ్య యోగక్షేమాలు చూసుకుంటోంది. కనీస సొంత ఇల్లు కూడా లేని కొండయ్య ఆదర్శనగర్లో నెలకు రూ 400 అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రభుత్వం వృద్ధులకు అందజేస్తున్న రూ.1000 ఆసరా ఫింఛన్ అతని జీవనధారం. వైశ్య కుటుంబంలో పుట్టిన అతను హోటల్ వ్యాపారం కన్న ముందు అనేక చిన్న చిన్న వ్యాపారులు చేసి చితికి పోయాడు. కనీసం ఇంట్లో మంచం, దుప్పట్లు, ఫ్యాన్ కూడా లేదు. ప్రభుత్వ ఇస్తున్న రేషన్ బియ్యాన్ని జావలా చేసి ఇస్తే తాగుతున్నాడు. తనను ఎవరైనా దాతలు ఆదుకోవాలని దీనంగా ఎదురుచూస్తున్నాడు. దాతలు భద్రాద్రి పట్టణంలోని ఆదర్శనగర్ 185 ఇంటి నంబర్లో సంప్రదించాలి.