టెస్కాబ్కు జాతీయ ఉత్తమ అవార్డు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)కు ప్రథమ బహుమతి లభించింది. ముంబైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ నేతి మురళీధర్ ఈ పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయిలో 2016–17 సంవత్సరానికి 32 రాష్ట్ర సహకార బ్యాంకుల్లో టెస్కాబ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.
దేశంలోని 93,367 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాడ్లరాంపూర్(నిజామాబాద్ జిల్లా)ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ద్వితీయ బహుమతి, దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న 371 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో(డీసీసీబీ) 2016–17 సంవత్సరానికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ డీసీసీబీకి తృతీయ బహుమతి లభించింది. ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీసీసీబీలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ముంబైలోని రాష్ట్ర సహకార బ్యాంకులు జాతీయ సమాఖ్య ప్రతిభా పురస్కారాలు అందజేస్తుంది.