హత్య కేసులో నిందితుడి రిమాండ్‌

Murder Accused Remanded - Sakshi

తిప్పర్తి(నల్లగొండ) : మండల పరిధిలోని మల్లెపల్లివారిగూడెంలో ఈ నెల 20న భార్యను హత్య చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి గురువారం తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మల్లెపల్లివారిగూడెం చెందిన ఆసియా అదే గ్రామానికి చెందిన జంజరాల శ్రీనులు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆసియా పెళ్లి చేసుకోవాలని శ్రీనును అడగడంతో అతడు ఒప్పుకోలేదు. దీంతో శ్రీను ఇంటి ముందు ఆసియా దీక్షకు దిగడంతో గ్రామ పెద్దలు, పోలీసులు సర్ధిచెప్పి ఈ ఏడాది మార్చి నెలలో మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురంలో ఓ గుడిలో వివాహం చేసుకున్నారు.

అప్పటి నుంచి తిప్పర్తిలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కానీ శ్రీను ఆసియాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో పెళ్లి నాటి నుంచి ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా గర్భం దాల్చడంతో శ్రీను బిడ్డ జన్మిస్తే ఆసియాను భార్యగా అంగీకరించాల్సి వస్తుందనే నేపంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో ఈ నెల 22న తల్లిగారింటిలో ఒంటరిగా ఉండడం గమనించి బ్లెడ్‌తో గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.

దీంతో ఆసియా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తిప్పర్తిలో అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎస్‌ఐ వీరరాఘవులు, ఏఎస్‌ఐ వెంకట్‌నారాయణ, కానిస్టేబుళ్లు వెంకటయ్య, సురేందర్, రమేష్, రాధిక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top