మున్సి‘పోల్స్‌’ పిల్స్‌పై తీర్పు వాయిదా | Municipal Elections Telangana High Court Reserves Orders On PILs | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’ పిల్స్‌పై తీర్పు వాయిదా

Oct 2 2019 4:03 AM | Updated on Oct 2 2019 4:03 AM

Municipal Elections Telangana High Court Reserves Orders On PILs - Sakshi

మున్సి‘పోల్స్‌’పిల్స్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలన్నీ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: మున్సి‘పోల్స్‌’పిల్స్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలన్నీ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌ జారీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలకు 110 రోజుల సమయం కావాలని సింగిల్‌ జడ్జి వద్ద చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత నెల రోజుల్లోగానే పూర్తి చేయడాన్ని తప్పుపడుతూ నిర్మల్‌ జిల్లాకు చెందిన అన్జుకుమార్‌రెడ్డి, డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి దాఖలు చేసిన పిల్స్‌ మంగళవారం ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. వాదనల సమయంలో ధర్మాసనం.. రాజ్యాంగంలోని 243వ అధికరణం ప్రకారం అయిదేళ్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సివుందని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించామని అధికారులు చెబుతున్నారని పేర్కొంది. 

స్టే ఉత్తర్వులు జారీ చేయలేదని, రాజ్యాంగం ప్రకారం మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించింది. తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు టి.సూర్యకిరణ్‌రెడ్డి, సిన్నోళ నరేష్‌రెడ్డిలు వాదిస్తూ.. ప్రభుత్వ అధికారులు హడావుడిగా ముందస్తు ప్రక్రియను పూర్తి చేశారని తప్పుపట్టారు. కుల గణనపై అభ్యంతరాలు చెప్పడానికి ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చారని, కనీసం అయిదు రోజులు గడువు ఉండాలన్నారు. ధర్మాసనం కలి్పంచుకుని.. జనాభా లెక్కల్లోనే పూ ర్తి వివరాలు ఉంటాయని, వాటి ఆధారంగా రిజర్వేషన్లు చేయవచ్చని పేర్కొంది. దీనిపై నరేశ్‌రెడ్డి దిస్తూ ముస్లింలు కూడా బీసీలుగా ఉన్నారని, ముస్లింల్లో అందరూ బీసీలు కాదని బదులిచ్చారు.  

ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులివ్వాలి...
ఈ ఏడాది జూలై 2తో పాలకవర్గాల గడువు ముగిసిందని, ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులివ్వాలని అదనపు ఏజీ జె.రామచంద్రరావు కోరారు. ఓటర్ల గణన జూలై 7నాటికి పూర్తి అయిందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం గడువు పూర్తి అయిన మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదిస్తూ ఎన్నికల ముందు ప్రక్రియ పూర్తి అయ్యాక ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు వారం రోజుల గడువు అవసరం అవుతుందన్నారు. ఓటర్ల జాబితా వెల్లడించాక ఎన్నికలు పూర్తికి మరో 20 రోజులు కావాలని, మొత్తం 27 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరం అవుతాయని, అందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు. 

గత ఏడాది సెపె్టంబర్‌ 15న ప్రభుత్వానికి లేఖ రాశామని, అదే ఏడాది డిసెంబర్‌ నాటికి ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ ఏడాది మార్చి 28 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తే జూలై 2తో ముగిసే మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగమని ఆ లేఖలో వివరించామన్నారు. ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోనందునే హైకోర్టులో కేసు వేయాల్సివచి్చందని వివరించారు. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించరాదని ఇప్పటికే సింగిల్‌ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం వెలువరించబోయే తీర్పు మేరకు మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement